Business

రాందేవ్‌బాబాపై FIR

రాందేవ్‌బాబాపై FIR

పతంజలి ‘కరోనా ఔషధం’పై రంగంలోకి పోలీసులు… రామ్ దేవ్ బాబా సహా ఐదుగురిపై ఎఫ్ఐఆర్!

తాను స్వయంగా దగ్గరుండి కరోనాకు ఔషధాన్ని కనుగొన్నామంటూ గర్వంగా ప్రకటించిన యోగా గురు రామ్ దేవ్ బాబా, ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయారు. పతంజలి విడుదల చేసిన ఔషధం కరోనాను వారం రోజుల్లో తగ్గిస్తుందని కూడా ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు. రామ్ దేవ్ బాబా చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా, అన్ని రాష్ట్రాల్లోని వార్తా చానెళ్లూ ప్రసారం చేశాయి. ఆపై గంటల వ్యవధిలోనే విమర్శలూ వెల్లువెత్తడంతో, ఉత్తరాఖండ్ సర్కారు, ఔషధానికి సంబంధించిన అన్ని వివరాలు, క్లినికల్ ట్రయల్స్ వివరాలు అందించాలని ఆదేశించింది.

రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు దగ్గును తగ్గించే ఓ మందును తయారు చేస్తున్నామని మాత్రమే పతంజలి సంస్థ తమను సంప్రదించిందని, ఈ డాక్యుమెంట్లలో కరోనా ప్రస్తావనే లేదని ఉత్తరాఖండ్ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వారం రోజుల్లో ఈ మందు కరోనాను ఎలా తగ్గిస్తుంది? ఎవరిలో వైరస్ ను తగ్గించింది? తదితర వివరాలు అందించాలని ఆదేశించింది.

ఇక దేశవ్యాప్తంగా పతంజలి మందుపై విమర్శలు వెల్లువెత్తగా, పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదులు అందాయి కూడా. ఈ నేపథ్యంలో జైపూర్ లోని జ్యోతి నగర్ పోలీసులు మరో అడుగు ముందుకేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రామ్ దేవ్ బాబాతో పాటు పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ, మరో ముగ్గురిపై కేసు రిజిస్టర్ చేశారు.