Politics

లాక్‌డౌన్‌పై నేడు కేసీఆర్ నిర్ణయం

లాక్‌డౌన్‌పై నేడు కేసీఆర్ నిర్ణయం

కరోనా నియంత్రణ కోసం రాజధానిలో లాక్‌డౌన్‌ సహా పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా నిర్వహించనున్న మంత్రిమండలి సమావేశంపై బుధవారం స్పష్టత రానుంది. లాక్‌డౌన్‌ను దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్‌ సహా ప్రవేశ పరీక్షలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం రోజంతా పలువురు మంత్రులు, నేతలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే మంత్రిమండలి సమావేశానికి సంబంధించి మంగళవారం ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ గడువు మంగళవారంతో ముగిసింది. కేంద్రం కూడా అన్‌లాక్‌పై విధివిధానాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవలసి ఉంది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని, పార్లమెంటులో చిత్రపటం ఏర్పాటుచేయాలని, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం, రాష్ట్ర ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన ఇతరత్రా నిర్ణయాలపైనా మంత్రిమండలిలో తీర్మానాలు చేయాల్సి ఉంది. వీటన్నింటి కోసమైనా కేబినెట్‌ సమావేశం జరగాల్సి ఉంది. ఈ విషయంలో బుధవారం సీఎం నిర్ణయం వెలువడే వీలుంది.