DailyDose

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్-వాణిజ్యం

Telugu Business News - Indian Stock Markets Witness Profits

* దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌ను భారీ లాభాల్లో ముగించాయి. సెన్సెక్స్‌ 498 పాయింట్లు లాభపడి 35,414 వద్ద నిఫ్టీ 127 పాయింట్లు లాభపడి 10,430 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. జీఐసీ హౌసింగ్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, కేఆర్‌బీఎల్‌, ఇండియన్‌ బ్యాంక్‌, స్వాన్‌ ఎనర్జీ లాభపడగా.. ఓమెక్సా, టినాడు న్యూస్‌ప్రింట్‌, క్యూస్‌ కార్ప్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, శ్రెయి ఇన్ఫ్రా నష్టపోయాయి.

* భారత ప్రభుత్వం 59 చైనా యాప్‌లపై నిషేధం విధించిన నేపథ్యంలో ఓ చైనా దినపత్రిక సంపాదకుడు చేసిన వివాదాస్పద ట్వీట్‌కు.. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా విభిన్నంగా స్పందించారు. వివరాల్లోకి వెళితే… కరోనా వైరస్‌తో సతమతమౌతున్న భారత్‌కు చైనా వ్యవహారం పులి మీద పుట్రలా తయారైంది. పొరుగుదేశంతో నిరంతరం గిల్లికజ్జాలకు పాల్పడుతున్న చైనాకు, ఆ దేశానికి చెందిన 59 యాప్‌లను నిషేధించిన భారత్‌ నిర్ణయం చెంపపెట్టు అయింది. ఈ నేపథ్యంలో హ్యు జిన్‌ ఓ చైనా పత్రిక ఎడిటర్‌ చేసిన భారత్‌ సామర్ధ్యాన్ని ఎగతాళి చేస్తూ చేసిన ట్వీట్‌కు.. ఆనంద్‌ మహీంద్రా అదిరిపోయే జవాబిచ్చారు.

* ఇకపై అన్ని బీఎస్‌-6 వాహనాలపై ఒక సెంటీమీటర్‌ గ్రీన్‌స్టిక్కర్‌ తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 1,2020 నుంచి ఇది అమల్లోకి రానుంది. కేంద్ర రవాణాశాఖ నిబంధనల ప్రకారం మూడవ నెంబరు‌ ప్లేట్‌ పై భాగంలో ఈ వన్‌ సీఎమ్‌ గ్రీన్‌స్టిక్కర్‌ ఉండాల్సిందే. 2018లో మోటారుచట్టంలో చేసిన మార్పులలో భాగంగా 2019 ఏప్రిల్‌ 1 నుంచి ట్యాంపర్‌ ప్రూఫ్‌తో కూడిన హై సెక్యురిటీ రిజిష్ట్రేషన్‌ ప్లేట్లను అన్ని వాహనాలు అమర్చుకోవాలి. అప్పటి నుంచి కొత్తగా తయారువుతున్న వాహనాలన్నింటిలో విండ్‌షీల్డ్‌ లోపలివైపు బయటకు కనిపించేలా హలోగ్రామ్‌తో కూడిన స్టిక్కర్‌ను అంటిస్తున్నారు. ఆ స్కిక్కర్‌ను లేజర్‌ స్కానింగ్‌ చేయడం ద్వారా పది అంకెలతో కూడిన పర్మినెంట్‌ ఐడింటిఫికేషన్‌ నెంబర్‌ను గుర్తిస్తారు. అలాగే ఈ హలోగ్రామ్‌ సహాయంతో ఆ వాహనం ఏ ఇంధనం( పెట్రోల్‌ లేదా డీజిల్‌) సహాయంతో నడుస్తున్నదనే విషయాన్ని కూడా తెలుసుకుంటారు.

* కరోనా వైరస్‌ సంక్షోభం కారణంగా భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ పుంజుకోవడానికి కొన్నేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌ (ఎస్‌అండ్‌పీ) అభిప్రాయపడింది. రుణాల పునర్‌వ్యవస్థీకరణతో నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) గుర్తించడం వాయిదా పడొచ్చేమో కానీ, ఎన్‌పీఏల సమస్య పరిష్కారం కాదని తెలిపింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రుణాల పునర్‌వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తోందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎస్‌అండ్‌పీ పైవిధమైన వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్‌ సృష్టించిన సంక్షోభ పరిణామాల ప్రభావం గతంలో అంచనా వేసిన దాని కంటే కూడా బ్యాంకులపై చాలా కాలం పాటు కొనసాగొచ్చని తెలిపింది. 2019-20లో 8.5 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2020-21లో 14 శాతానికి పెరగొచ్చని ఎస్‌అండ్‌పీ అంచనా వేసింది. ‘కొవిడ్‌-19 ప్రభావం వల్ల భారత బ్యాంకింగ్‌ రంగం పుంజుకోవడానికి ఏళ్లు పట్టే అవకాశం ఉంది. రుణాల మంజూరు నెమ్మదించి తద్వారా ఆర్థిక వ్యవస్థ మందగమనానికి ఈ పరిణామం దారితీస్తుంద’ని తెలిపింది. లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో రుణాల ఈఎంఐలపై ఆరు నెలల పాటు మారటోరియం సదుపాయాన్ని ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీని తర్వాత కొన్ని జాగ్రత్తలతో రుణాల పునర్‌వ్యవస్థీకరణకు వీలు కల్పించే ఉద్దేశంలో ఆర్‌బీఐ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎస్‌అండ్‌పీ స్పందిస్తూ.. ఈ నిర్ణయం వల్ల సమస్య పరిష్కారం కాదని, కొన్నేళ్లక్రితం జరిగినట్లుగా నిరర్థక ఆస్తుల గుర్తించడం మాత్రమే ఆగిపోతుందని తెలిపింది. రుణాల పునర్‌వ్యవస్థీకరించడం వల్ల ఆస్తుల నాణ్యతపై ఆర్‌బీఐ సమీక్ష నిర్వహించాల్సి వచ్చిన విషయాన్ని ఎస్‌అండ్‌పీ గుర్తుచేసింది. రుణాలను పునర్‌వ్యవస్థీకరిస్తే బ్యాంకులపై వ్యయ భారం కూడా పెరుగుతుందని తెలిపింది. మొండి బకాయిల వసూళ్లు బాగా పడిపోవడమే కాకుండా ఇవి మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. బ్యాంకులతో పోలిస్తే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. రంగాల విషయానికొస్తే… స్థిరాస్తి, టెలికాం, విద్యుత్‌ రంగాల్లో మొండి బకాయిలు పెరగడం కొనసాగొచ్చని తెలిపింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల రుణాల చెల్లింపులపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ప్రకటించిన రుణ హామీ పథకం వీటికి కొంత మేలు చేయొచ్చని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.40,000 కోట్ల వరకు మూలధన సహాయం అవసరం అవుతుందని ఎస్‌అండ్‌పీ తెలిపింది.

* ప్రభుత్వ రంగ చమురు-సహజ వాయువు (ఓఎన్‌జీసీ) సంస్థ తొలిసారిగా త్రైమాసిక నష్టాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ రూ.3,098 కోట్ల నష్టం ప్రకటించింది. ఆదాయం రూ.26,759 కోట్ల నుంచి రూ.21,456 కోట్లకు పరిమితమైంది. చమురు-గ్యాస్‌ ధరలు భారీగా పతనమైన నేపథ్యంలోనే నష్టాలు ప్రకటించాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. కాగా, అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ రూ.4,240 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. ‘2019-20 నాలుగో త్రైమాసికంలో ముడి చమురు ధరలు భారీగా పతనమైన నేపథ్యంలో ఓఎన్‌జీసీ రూ.4,899 కోట్ల ఇంపెయిర్‌మెంట్‌ నష్టం నమోదు చేయాల్సి వచ్చింద’ని కంపెనీ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శశి శంకర్‌ వెల్లడించారు. సమీక్షా త్రైమాసికంలో ముడి చమురు ఉత్పత్తి 59 లక్షల టన్నుల నుంచి స్వల్పంగా తగ్గి 58.2 లక్షల టన్నులకు పరిమితమైంది. సహజ వాయువు ఉత్పత్తి కూడా 656 కోట్ల క్యూబిక్‌ మీటర్ల నుంచి 604 కోట్ల క్యూబిక్‌ మీటర్లకు తగ్గింది. కాగా, 2019-20 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఓఎన్‌జీసీ నికర లాభం రూ.26,765 కోట్ల నుంచి 13,445 కోట్లకు పరిమితమైంది. అలాగే ఓఎన్‌జీసీ విదేశీ అనుబంధ సంస్థ ఓఎన్‌జీసీ విదేశ్‌ నికర లాభం కూడా రూ.1,682 కోట్ల నుంచి రూ.454 కోట్లకు తగ్గింది. ఈ సంస్థకు కూడా సుమారు రూ.3,000 కోట్ల ఇంపెయిర్‌మెంట్‌ నష్టం వాటిల్లినట్లు శశి శంకర్‌ వివరించారు.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్‌- మే) ద్రవ్యలోటు రూ.4.66 లక్షల కోట్లుగా నమోదైంది. 2020-21 బడ్జెట్‌ అంచనా అయిన రూ.7.96 లక్షల కోట్లలో ఇది 58.6 శాతం. కరోనా సంక్షోభం వల్ల విధించిన లాక్‌డౌన్‌తో పన్ను వసూళ్లు తగ్గడం ప్రభావం చూపింది. గతేడాది ఇదే కాలంలో ద్రవ్యలోటు ఆ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనాలో 52 శాతంగా ఉంది. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ గణాంకాల ప్రకారం.. మే చివరకి ద్రవ్యలోటు రూ.4,66,343 కోట్లు. ఏప్రిల్‌ చివరికి లోటు బడ్జెట్‌ అంచనాల్లో 35.1 శాతంగా నమోదైంది. ఈ ఆర్థికం తొలి రెండు నెలల్లో పన్ను వసూళ్లు రూ.33,850 కోట్లుగా ఉన్నాయి. బËడ్జెట్‌ అంచనాల్లో ఇవి కేవలం 2.1 శాతానికి సమానం.ఇక 2020 మార్చికి ప్రభుత్వం మొత్తం రుణాలు ముందు త్రైమాసికంతో పోలిస్తే 0.8 శాతం పెరిగి రూ.94.62 లక్షల కోట్లకు చేరాయని ఆర్థిక శాఖ నివేదిక వెల్లడించింది. ఇందులో ప్రజా రుణాలు వాటా 90.9 శాతంగా ఉంది. గతేడాది డిసెంబరుకు మొత్తం రుణాలు రూ.93.89 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

* ఇండియాలో బంగారం ధర ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. బుధవారం నాటి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో 10 గ్రాముల బంగారం ధర రూ. 48,829కి చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది రూ. 67 అధికం. దీంతో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలో కొత్త రికార్డు నమోదైనట్లయింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 8 సంవత్సరాల గరిష్ఠానికి చేరిన నేపథ్యంలోనే ధరలు పెరిగాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. సమీప భవిష్యత్తులో బంగారం ధర రూ. 49 వేలను దాటి ముందుకు సాగుతుందని వెల్లడించారు

* వంటగ్యాస్ సిలిండర్ ధర నేటి నుంచి పెరిగింది.అంతర్జాతీయంగా చమురు ధరలకు తగ్గట్టుగా దేశంలో వంటగ్యాస్ రేట్లను క్రమబద్ధీకరిస్తూ … లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ళ్ఫ్ఘ్) గ్యాస్ ధరను పెంచేశాయి కంపెనీలు.గత నెలలో ఇలాగే ధర పెంచిన కంపెనీలు… మళ్లీ జులై రాగానే మరోసారి పెంచేశాయి.ఇండియన్ ఆయిల్‌ కంపెనీకి చెందిన 14.2 కేజీల సిలిండర్ (సబ్సిడీ కానిది) ఇండేన్…ఇప్పుడు… ఢిల్లీ, ముంబైలో రూ.594 రూపాయలు అయ్యింది. ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1 పెరగగా… ముంబైలో రూ.3.5 పెరిగింది. గత నెల్లో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్‌పై ధరను రూ.11.50 పెంచారు.అంతకుముందు వరుసగా మూడు నెలలపాటూ ధర తగ్గించడంతో… అప్పట్లో బండ ధర రూ.277కే లభించిందిఫిబ్రవరిలో ధర ఏకంగా రూ.858కి పెరిగింది.