Editorials

భూటాన్‌ను కబళిస్తున్న చైనా

China Encroaching Bhutan - Telugu Editorials

చైనా ఏకంగా తనకు ఏమాత్రం సరిహద్దులేని భూటాన్‌లోని ఓ భూభాగాన్నీ తమదనే చెబుతోంది. ప్రపంచ దేశాలు కూడా ఈ ప్రకటనతో కొంచెం ఆశ్చర్యపోయాయి. ఆ తర్వాత చైనా తత్వం తెలుసుకొని దీని తీరు ఇంతేలే అనుకొన్నాయి. భారత్‌పై అక్కసుతోనే ఇలా చేస్తోందని అర్థం చేసుకున్నాయి.

భూటాన్‌-భారత్‌ మధ్య ప్రత్యేకమైన బంధం. భూటాన్‌ రక్షణకు భారత్‌ హామీ ఇస్తోంది. భూటాన్‌పై దాడిని భారత్‌పై దాడిగా పరిగణిస్తామని గతంలో పార్లమెంట్‌లో నాటి ప్రధాని నెహ్రూ ప్రకటించారు. ఆ తర్వాత ఎన్ని మార్పులు జరిగినా ఆ బంధం అలానే కొనసాగుతూ వస్తోంది. 2017లో డోక్లాం వద్ద భూటాన్‌ కోసమే భారత్‌ చైనాకు ఎదురొడ్డి నిలిచింది. తాజాగా మళ్లీ డోక్లాం వంటి సమస్యను సృష్టించేందుకు చైనా సన్నాహాలు మొదలుపెట్టింది. చైనా విదేశాంగ శాఖ నిన్న అధికారికంగా ఓ వివాదాస్పద ప్రకటన చేసింది. భూటాన్‌ తూర్పు భాగంలో కూడా తమకు సరిహద్దు వివాదం ఉందని పేర్కొంది. తూర్పు, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోలేదని భారత్‌కు చెందిన ఓ ఆంగ్ల పత్రికకు ప్రకటన జారీ చేసింది. పైగా ఈ విషయంలో మూడో పక్షం జోక్యం చేసుకోకూడదని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు భారత్‌ను ఉద్దేశించి చేసినవే అని చెప్పకనే చెబుతోంది. వీటిపై భారత విదేశంగా స్పందించలేదు.

ఇటీవల జరిగిన గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఫెసిలిటీ (జీఈఎఫ్) సదస్సుల్లో భూటాన్‌లో సాక్టెంగ్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రాజెక్టు అభివృద్ధికి జీఈఎఫ్‌ నిధుల ఇవ్వడంపై చైనా అభ్యంతరం చెప్పింది. అది తమ మధ్య వివాదాస్పద భూభాగంగా పేర్కొంది. వాస్తవానికి వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి చైనాతో సరిహద్దులు లేవు. భారత్‌కు చెందిన అరుణాచల్‌ ప్రదేశ్‌తో హద్దులు ఉన్నాయి. దీంతో జీఈఎఫ్‌ చైనా అభ్యంతరాన్ని నమోదు చేసుకొంది. అంతేగానీ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపును ఆపలేదు. వాస్తవానికి ఇరు దేశాల మధ్య పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో సరిహద్దు వివాదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 1984 నుంచి 2016 వరకు వీటిపై 24 దఫాలు చర్చలు జరిగాయి. కానీ, ఎక్కడా తూర్పు భాగంలో విభేదాలు ఉన్నట్లు పేర్కొనలేదు. ఈ మీటింగ్‌ వివరాలు ఉన్న ప్రతుల్లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. తూర్పు భాగం పూర్తిగా మరో కొత్త వివాదం అని భూటాన్ చెబుతోంది. ఇటీవల ప్రధాని మోదీ హఠాత్తుగా లద్దాఖ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో విస్తరణ వాదానికి కాలం చెల్లిందని మోదీ వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా చైనా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో భారత్‌ను కవ్వించేందుకే ఇలాంటి ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. దీనికి తోడు ఇటీవలే చైనాకు సరిహద్దు వివాదం ఉన్న దేశాలు కేవలం భూటాన్‌, భారత్‌ మాత్రమే అని డ్రాగన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. భూటాన్‌ సాక్టెంగ్‌ భూభాగం తమదే అని చెప్పడం అంటే.. భారత్‌లో అరుణాచల్ ప్రదేశ్‌ మాదే.. అక్కడి నుంచి భూటాన్‌తో సరిహద్దు వివాదం ఉందని చెప్పుకోవడం అన్నమాట. అంటే భారత్‌తో మరోవైపు వివాదానికి చైనా సిద్ధమవుతోందనే సంకేతాలు వచ్చినట్లే!!