Business

మొన్న బెజవాడ…నేడు భాగ్యనగరి!

మొన్న బెజవాడ…నేడు భాగ్యనగరి!

తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు కరోనాకు ముందు.. తర్వాతలా మారాయి. ఇంతకాలం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిన అద్దె ఇళ్ల సంబరం.. ఇప్పుడు యజమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. హైదరాబాద్‌లో భారీగా డిమాండ్‌ ఉండే అద్దె గృహాలు కొవిడ్‌ కారణంగా To-Let బోర్డులతో దర్శనమిస్తున్నాయి. నాడు విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం నగరాలకు వచ్చే వారి సంఖ్య భారీగా ఉండటంతో యజమానులు అద్దె ధరలు అమాంతం పెంచేశారు. ఇటీవల గత మూడు నెలలుగా సరైన అద్దెలు లేక అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్‌లో సొంతిల్లు పేదవాడికి ఊహకు అందని అద్భుతం. సొంతిల్లు ఉంటే అద్దెలతోనే బతికేయొచ్చన్నది కరోనాకు ముందున్న పరిస్థితులు. జీవన చక్రం ఒక్కసారిగా తలకిందులైంది. నాడు ఒక్క గది కావాలన్నా, రూ.4 నుంచి రూ.5 వేలు, సింగిల్‌ బెడ్‌ రూం రూ.5 నుంచి రూ.10వేలు, డబుల్‌ బెడ్‌ రూం. రూ.10 నుంచి రూ.20వేలు పలికాయి. నగరంలో అద్దెకు ఇళ్లు దొరకడం అంటేనే కష్టం. అలాంటిది కరోనా ధాటికి ఈ రంగమూ నష్టాలను మూటగట్టుకుంటోంది. వైరస్‌ వ్యాప్తితో పాటు, ఉపాధి, వ్యాపార అవకాశాలు కోల్పోయి, అత్యధికమంది ఇంటి బాటపడుతున్నారు. ఇప్పుడు సగం ధరలకు అద్దెకు ఇస్తామన్నా, వచ్చే వారు లేక ఇళ్లముందు To-Let బోర్డులు వేలాడుతున్నాయి. విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం వచ్చిన వాళ్లు ఇళ్లు ఖాళీ చేయడంతో యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు, నాలుగు నెలలుగా అద్దెలు లేక భవనాల నిర్వహణ, పన్నులు చెల్లించడం భారమవుతోంది. నగరంలో అత్యధిక డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లోనూ పరిస్థితి తీసికట్టుగా మారింది. సామాన్యుల నుంచి, పలు వ్యాపార సముదాయాల వరకూ ఉపాధి కోల్పోయి ఇళ్లు, కార్యాలయాలు ఖాళీ చేస్తున్నారు. కరోనా కారణంగా స్కూళ్లు, కాలేజ్‌లు, శిక్షణ సంస్థలు ప్రారంభం కాలేదు. ఇప్పట్లో ఇవి మొదలయ్యే అవకాశం లేకపోవడంతో చాలామంది ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడుతున్నాయి. చిరు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. గిరాకీలు లేక అద్దె చెల్లించే పరిస్థితి కూడా లేదు. దుకాణాలతో పాటు, అద్దె ఇళ్లను కూడా ఖాళీ చేసి, సొంతింటికి వెళ్లిపోతున్నారు. దీంతో భవనాల నిర్వహణ, ఈఎంల చెల్లింపులు యజమానులకు భారంగా మారాయి.