DailyDose

రాష్ట్రపతికి తెదేపా ఎంపీల ఫిర్యాదు-తాజావార్తలు

TDP MPs Complain To Ramnath Kovind On YSRCP

* అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అరాచక పాలన చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణలో జోక్యం చేసుకోవాలని కోరారు. కనకమేడల రవీంద్రకుమార్‌, గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని దిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిశారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ… తాము చెప్పిన విషయాలను రాష్ట్రపతి సావదానంగా విన్నారని, తన పరిధిలో తీసుకోగలిగే చర్యలను పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు.

* కరోనా సోకిన జగిత్యాల జిల్లావాసికి చికిత్స నిర్వహించి రూ.1.50కోట్ల బిల్లును మాఫీ చేసి దుబాయ్‌ ఆస్పత్రి ఉదారతను చాటుకుంది. ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన గుల్లపల్లిమండలం పెనుగుముట్లకు చెందిన వడ్నాల రాజేశ్‌ కరోనా బారినపడి ఏప్రిల్‌ 23న దుబాయ్‌లోని ఆస్పత్రిలో చేరాడు. 80 రోజుల చికిత్సకు గానూ రూ.1కోటి 52 లక్షల బిల్లు వచ్చింది. భారీగా బిల్లు రావడంతో పలు ఎన్నారై సంఘాలు ఇండియా కాన్సులేట్‌ దృష్టికి తీసుకెళ్లాయి. కాన్సులేట్‌ విజ్ఞప్తితో దుబాయ్‌ ప్రభుత్వం బిల్లును మాఫీ చేయించి, విమాన టికెట్లు ఇప్పించి, ఖర్చులకు గానూ మరో రూ.10,000 అందించింది. ఈ నెల 12న స్వగ్రామం చేరుకున్న రాజేశ్‌ హోం క్వారంటైన్‌లో ఉన్నాడు.

* తితిదే ఉద్యోగులకు 40 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి వెల్లడించారు.అన్నమయ్య భవన్‌లో ఆర్చకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా బారిన పడిన వారిలో 14 మంది అర్చకులు ఉన్నారని అయన అన్నారు. శ్రీవారి దర్శనాలు మళ్లీ ఆపేస్తారని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఇప్పట్లో దర్శనాలు నిలిపే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

* తెలంగాణ సచివాలయం కూల్చివేతపై ఇచ్చిన స్టే ను హైకోర్టు రేపటి వరకు పొడిగించింది. కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నిన్న విచారణ సందర్భంగా సచివాలయ భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతి అవసరమా? లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని కోరింది.

* రాజస్థాన్‌లో రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ ఇంకా తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. మరోవైపు సీఎల్పీ సమావేశానికి గైర్హాజరైన కారణంగా సచిన్‌ పైలట్‌తోపాటు మరో 18మంది రెబల్‌ ఎమ్మెల్యేలకు సభాపతి ద్వారా కాంగ్రెస్‌ నోటీసులు జారీ చేసింది. అనర్హతపై స్పీకర్‌ ఇచ్చిన నోటీసులపై సచిన్‌ పైలట్‌ హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

* భారత్‌ – చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను పూర్తిగా తగ్గించేందుకు ఇరుపక్షాలు కట్టుబడి ఉండేందుకు అంగీకరించాయని భారత సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరు దేశాలకు చెందిన సీనియర్‌ సైనికాధికారులు జులై 14న నాలుగో విడత చర్చలను చుషూల్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. వీరు ఇప్పటికే ఉద్రిక్తతలను చల్చార్చేందుకు తొలిఅడుగులో భాగంగా తీసుకొన్న చర్యలను సమీక్షించారు. తర్వాత పూర్తిస్థాయిలో బలగాల విరమణపై కూడా చర్చించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ తాజాగా 2,593 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంక్‌య 38,044కి చేరింది.కరోనా కారణంగా ఇవాళ ఒక్కరోజే 40 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 492కి చేరింది.

* తెలంగాణ సచివాలయం కూల్చివేతపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై బెంచ్‌లో విచారణ జరిగింది. సచివాలయం కూల్చివేత పర్యావరణానికి సంబంధించిన విషయం అయినందువల్ల ఎన్జీటీలో విచారణ చేపట్టాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించారు.దీనిపై స్పందించిన ఎన్జీటీ.. హైకోర్టులో విచారణ తర్వాత వాదనలు వింటామని చెప్పింది.

* టిక్‌టాక్‌ సహా అనేక చైనీస్‌ యాప్‌లను నిషేధించాలని అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుల్లో కొందరు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు లేఖరాశారు. కఠిన నిర్ణయాలు తీసుకొని భారత్‌ చూపిన బాటలో నడవాలని సూచించారు. అమెరికన్‌ పౌరుల సమాచారం బయటకు పోకుండా, వారి గోప్యత, భద్రతకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

* సొంత దేశానికే కాకుండా ప్రపంచమంతటికీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను సరఫరా చేయగల సామర్థ్యం భారత ఫార్మా పరిశ్రమకు ఉందని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ అన్నారు. అక్కడ కీలకమైన పనులెన్నో జరిగాయని పేర్కొన్నారు. ఇతర వ్యాధుల కోసం ఏర్పాటు చేసుకున్న సదుపాయాలను కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తయారీకి ఉపయోగిస్తున్నారని ప్రశంసించారు.

* చైనాకు చెందిన వీడియో యాప్‌ టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం ఇటీవల నిషేధించినా కొందరు ఆ యాప్‌ను అనధికారికంగా డౌన్‌లోడ్‌ చేస్తున్నారు. అలాంటి వారు కోరి ప్రమాదం తెచ్చుకున్నట్లే అని సైబర్‌ నిపుణులు అంటున్నారు. ఏపీకే ఫైల్‌ ద్వారా టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేవారు త్వరలోనే సైబర్‌ దాడికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిపై అమెరికాలో సైబర్‌ సెక్యూరిటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్న బుసారపు వెంకట్‌రామన్‌ ఈ ప్రమాదం గురించి వివరించారు.