DailyDose

ట్విట్టర్‌కు భారత ప్రభుత్వం నోటీసులు-తాజావార్తలు

ట్విట్టర్‌కు భారత ప్రభుత్వం నోటీసులు-తాజావార్తలు

* ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖల ట్విటర్‌ ఖాతాలు హ్యాకింగ్‌కు గురవ్వడంతో భారత సైబర్‌ భద్రతా నోడల్‌ ఏజెన్సీ సెర్ట్‌-ఇన్‌ అప్రమత్తమైంది. ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది. హ్యాకింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని ఆదేశించింది. ప్రస్తుత సైబర్‌ దాడి వల్ల ఎంత మంది భారతీయుల సమాచారంపై ప్రభావం పడిందో వెల్లడించాలని కోరింది.

* కరోనా మహమ్మారి అనేక దయనీయ పరిస్థితులకు దారితీస్తోంది. సహజంగా మరణించినా.. కరోనా భయంతో బంధువులు కానీ, చుట్టుపక్కలవారు కానీ అంతిమ సంస్కారాలకు ముందుకు రావడంలేదు. కర్ణాటకలోని బెలగావి జిల్లా అథాని నివాసి గత కొద్ది కాలంగా అనారోగ్యంలో బాధపడుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. అయితే కొవిడ్‌ భయంతో బంధువులు, తెలిసినవారు ఎవరూ కూడా మృతదేహాన్ని చూసేందుకు రాలేదు. దీంతో మృతుడి కుమారుడు తండ్రి శవాన్ని రిక్షాపై తోసుకుంటూ స్మశానవాటికకు తీసుకెళ్లాడు. అనంతరం మృతుడి భార్య, కుమారుడే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

* మాజీ మంత్రి వికానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ ప్రారంభించింది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు విచారణ మొదలుపెట్టారు. కడప ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అన్బురాజన్‌తో ఏడుగురు అధికారులు సమావేశమయ్యారు. 2019 మార్చి 15న జరిగిన వివేకా హత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పులివెందులకు వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టనున్నారు. వివేకా హత్య కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఏపీలో వేధింపులు, చట్టవిరుద్ధమైన అరెస్టులు జరుగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు లేఖ రాశారు. ప్రాథమిక హక్కుల పునరుద్ధరణ, పరిరక్షణ కోసం లేఖలో ప్రస్తావించారు. చట్టవిరుద్ధమైన అరెస్టులు, అక్రమ నిర్బంధాలు పెరిగిపోయాయని లేఖలో పేర్కొన్నారు. ‘‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. మాట్లాడే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛను అధికార పార్టీ హరించేస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా పోలీసులు అనాగరిక ధోరణితో వ్యవహరిస్తున్నారు’’ అని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

* ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 3,963 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 44,609కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 52 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు 589 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇంత ఎక్కువ మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

* తెలంగాణలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. వివిధ జిల్లాల్లోని అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు.. బలగాలతో ఎక్కడికక్కడ కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి స్వయంగా ఆసిఫాబాద్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

* అది లద్దాఖ్‌లోని మంచుతో నిండిన పర్వత ప్రాంతం.. ఇంతలో అక్కడికి చేరుకున్న సీ-130జే సూపర్‌ హెర్క్యులస్‌ విమానం నుంచి ఒక్కొక్కరుగా పారాట్రూపర్లు ర్యాంపు అంచు నుంచి కిందకి దూకుతున్నారు. సైనికుల ధైర్యసాహసాలకు నిదర్శనమైన ఇలాంటి విన్యాసాలు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను అబ్బురపరిచాయి. శుక్రవారం రాజ్‌నాథ్‌ లద్దాఖ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సైనిక విన్యాసాలను ఆయన తిలకించారు.

* రాజస్థాన్‌ రాజకీయాల్లో ఆడియోటేపుల ఉదంతం కాంగ్రెస్‌, భాజపా మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఓవైపు ఆడియో టేపులు నకిలీవని వాదిస్తున్న భాజపా.. ఈ రికార్డింగ్‌ ఘటన ద్వారా కాంగ్రెస్‌ ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు స్పష్టమవుతోందని ఆరోపించింది. దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేసింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్‌.. ఆడియో టేపులు నకిలీవే అయితే, అసలు ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం ఎందుకు తలెత్తిందని ప్రశ్నించింది. మరోవైపు భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సచిన్‌ పైలట్ తలదాచుకోవాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా ప్రశ్నించారు.

* కరోనా విజృంభణతో థియేటర్‌లు బంద్‌. ఏవైనా కొత్త సినిమాలు చూద్దామంటే బయటకు కుటుంబసమేతంగా వెళ్లలేని పరిస్థితి. ఇప్పుడంతా ఓటీటీ, ఆన్‌లైన్‌లదే హవా. అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్‌, జియో, హెచ్‌బీవో, ఆహా వంటివి పోటాపోటీగా సినిమాలను, కార్యక్రమాలను ప్రేక్షకుల కోసం అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే వీటిల్లో వీక్షించాలంటే చందా కట్టాల్సిందే. ఇలాంటి సమయంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొందని చెప్పొచ్చు. దీనిని అవకాశంగా తీసుకున్న నెట్‌ఫ్లిక్స్‌ ప్రేక్షకులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

* మ సంస్థలోని కొందరు ఉద్యోగుల్ని హ్యాకర్లు నియంత్రించగలిగారని ట్విటర్‌ తెలిపింది. దాంతో వారు అంతర్గత వ్యవస్థలకు సంబంధించిన వివరాలు పొందగలిగారని వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరోకు సహకరిస్తున్నామని పేర్కొంది. జో బిడైన్‌, ఎలన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, బరాక్‌ ఒబామా, వారెన్‌ బఫెట్‌ సహా అనేక మంది ప్రముఖుల ట్విటర్ ఖాతాలను శుక్రవారం హ్యాకర్లు హ్యాక్‌ చేశారు.

* మహారాష్ట్రలో ‘ఆపరేషన్‌ కమలం’ ప్రక్రియ కొనసాగడం లేదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్‌ అన్నారు. అంతర్గత కలహాలతో మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని జోస్యం చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం ముగిశాక ఆయన ఇలా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చక్కెర పరిశ్రమకు ఆర్థిక సాయం అందించాలని కోరేందుకే అమిత్‌షాతో సమావేశం అయ్యానని ఫడణవిస్‌ తెలిపారు. రాజకీయ అంశాలేవీ మాట్లాడలేదని పేర్కొన్నారు.

* లాక్‌డౌన్‌ సమయంలో వేల మంది వలస కార్మికులను స్వస్థలాలకు పంపించి.. రీల్ విలన్‌ సోనూసూద్‌ రియల్‌ హీరోగా మారిపోయాడు. లాక్‌డౌన్‌ సమయంలో తనకు ఎదురైన అనుభవాలతో ఓ పుస్తకం రాస్తానని ఇది వరకే సోనూ సూద్‌ వెల్లడించాడు. అయితే తాజాగా సోనూపై ఓ సినిమా కూడా తెరకెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన సోనూ ఆసక్తికరమైన విషయం వెల్లడించాడు.