అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్క్లపై తనకున్న అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. గత కొన్నిరోజుల క్రితం వరకూ మాస్కు ధరించను అని తెగేసి చెప్పిన ట్రంప్, ప్రస్తుతం మాస్క్తోనే దర్శనమిస్తున్నారు. తాజాగా ఇదే విషయాన్ని చెబుతూ.. నాకన్నా దేశభక్తుడు ఎవరూ లేరంటూ ట్వీట్ చేశారు.
మాస్కుతో ఉన్న ఫోటోను ట్విటర్లో పోస్టు చేసిన ట్రంప్.. ‘ప్రపంచాన్ని పీడిస్తోన్న చైనా వైరస్ను ఎదుర్కొనేందుకు మనందరం కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాం. ఈ సమయంలో భౌతిక దూరం పాటించలేని సమయాల్లో ముఖానికి మాస్క్ వేసుకోవాలని చాలా మంది అంటున్నారు. కానీ, నాకన్నా ఎక్కువ దేశభక్తుడెవరూ లేరు’ అని పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత మరింత పెరిగింది. నిత్యం దాదాపు 60వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో కేసుల సంఖ్య 38లక్షలు దాటగా లక్షా 40వేల మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసులు, మరణాల్లో అమెరికా ప్రపంచంలోనే తొలిస్థానంలో కొనసాగుతోంది.