Devotional

ఇనుము లేకుండా రామాలయ నిర్మాణం

ఇనుము లేకుండా రామాలయ నిర్మాణం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించనున్న రామ మందిరం భూమి పూజ ఆగస్టు 5న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మందిర నిర్మాణానికి సంబంధించిన వార్తలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి. ఈ క్రమంలో మందిరంలో మూడు అంతుస్తులు ఉండనున్నట్లు సమాచారం. గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్‌లుగా నిర్మాణం జరగనుంది. ప్రతిపాదిత రామమందిరాన్ని 10 ఎకరాల స్థలంలో నిర్మిస్తుండగా.. మిగిలిన 57 ఎకరాలను రామ్‌ టెంపుల్‌ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆమోదించిన ప్రణాళిక ప్రకారం ఆలయ సముదాయంలో నక్షత్ర వాటిక కూడా నిర్మించనున్నారు. ఒక్కొ నక్షత్రానికి సంబంధించి ఒక్కొక్కటి చొప్పున మొత్తం 27 మొక్కలను నాటనున్నారు. నక్షత్ర వాటిక ప్రధాన ఉద్దేశం ఏంటంటే జనాలు తమ పుట్టిన రోజునాడు వారి జన్మ నక్షత్రం ప్రకారం ఆయా చెట్ల కింద కూర్చుని ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఈ నిర్మాణం ఉండనుంది. ఆలయ పునాది 15 అడుగుల లోతులో ఉంటుంది. ఇది 8 పొరలను కలిగి ఉంటుంది. ప్రతి పొర 2 అడుగుల వెడల్పు ఉంటుంది. పునాది వేదికను సిద్ధం చేయడానికి కాంక్రీట్‌, మోరాంగ్‌ను వాడనున్నారు. అయితే ఆలయ నిర్మాణంలో ఇనుమును ఉపయోగించడం లేదు. అంతేకాక వాల్మీకి రామాయణంలో పేర్కొన్న చెట్లను రామ్‌ టెంపుల్‌ కాంప్లెక్స్‌లో నాటనున్నారు. ఈ ప్రాంతానికి వాల్మీకి రామాయణానికి అనుగుణంగా పేరు పెడతారు. మందిరం భూమి పూజ తర్వాత రామ్‌ టెంపుల్‌ కాంప్లెక్స్‌లో శేషవతార్‌ ఆలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని ట్రస్ట్‌ ప్రతిపాదించింది.