Agriculture

చిత్తూరు రైతు కుటుంబానికి ట్రాక్టర్ అందించిన సోనూ

Telugu Agriculture News - Chittoor Farmer Family Gets Helped By Sonu

ప్రముఖ నటుడు సోనూసూద్‌ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. లాక్‌డౌన్‌ వేళ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చిన ఈ నటుడు.. ఈ సారి ఓ రైతు తన కుటుంబంతో పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయాడు. కుమార్తెలే కాడెద్దులుగా మారిన వీడియోపై ట్విటర్‌ వేదికగా స్పందించాడు. సదరు రైతుకు ట్రాక్టర్‌ కొనిస్తానని హామీ ఇచ్చాడు. చిత్తూరు జిల్లా కె.వి.పల్లి మండలం మహల్‌ రాజపల్లిలో రైతు నాగేశ్వరరావు తన కుమార్తెలతో పొలం దున్నిస్తున్న వీడియో ఒకటి ఇటీవల బయటకొచ్చింది. కరోనా కష్టకాలంలో ఓ రైతు తన కుటుంబంతో కష్టపడుతున్న ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో తొలుత రేపు ఉదయానికల్లా ఎద్దులు కొనిస్తానని తొలుత సోనూ ట్వీట్‌ చేశాడు. కాసేపటికే ఎద్దులు కాదు.. ఈ రైతు ట్రాక్టర్‌కు అర్హుడు అంటూ ట్రాక్టర్‌ కొనిస్తానని హామీ ఇచ్చాడు. రైతులు దేశానికి గర్వకారణమని చెబుతూనే కుమార్తెల చదువులపై దృష్టి సారించాలని సదరు రైతును సోనూ కోరాడు. అతడి ప్రకటనతో ‘సోనూది గొప్ప మనసు’ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. రిలీఫ్‌ ఫండ్‌ కోసం ఓ ఖాతా తెరిస్తే తమవంతు సాయపడతామని ట్వీట్‌చేస్తున్నారు. సాయం చేస్తానని ప్రకటించిన కొద్ది గంటల్లోనే సోనూసూద్‌ చిత్తూరు జిల్లా మదనపల్లెలో ట్రాక్టర్‌ ఆర్డర్‌ చేశాడు. దీంతో షోరూమ్‌ నిర్వాహకులు రైతు నాగేశ్వరరావుకు ఆదివారం సాయంత్రం ట్రాక్టర్‌ను అందజేశారు. తమకు సాయం చేసిన నటుడికి రైతు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.