Movies

రేటు పెరిగింది

రేటు పెరిగింది

టాలీవుడ్‌కు మోస్ట్‌ ఎలిజబుల్‌ హీరోయిన్లుగా .. ఎక్కువ వినిపించే పేర్లలో పూజ హెగ్డే ఒకరు. ‘అల వైకుంఠపురములో’తో ఈ ఏడాది భారీ హిట్‌ కొట్టింది పూజ. ఆ తర్వాత వరుస సినిమాలు సంతకం చేసేస్తుంది అనుకున్నా… కరోనా-లాక్‌డౌన్‌ కారణంగా ఆమె కొత్త సినిమాలేవీ పట్టాలెక్కలేదు. అయితే, అప్పటికే అంగీకరించిన ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్‌’, అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌’ సెట్స్‌పై ఉన్నాయి. వరుసగా పెద్ద సినిమాలున్నాయన్నా ఆలోచన వల్లనో లేక, ‘అల వైకుంఠపురములో’ ఇచ్చిన కిక్ వల్లనో కానీ, పూజ పారితోషికం పెంచేసిందట. ‘అల వైకుంఠపురములో’కు పూజా హెగ్డే ₹1.4 కోట్లు తీసుకుందని టాలీవుడ్‌ వర్గాల టాక్‌. ఇప్పుడు ఆమె తన పారితోషికాన్ని రూ. రెండు కోట్లకు పెంచేసిందని తెలుస్తోంది. ఇప్పటి వరకు పూజ తీసుకున్న అత్యధిక పారితోషికం బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ సినిమా ‘సాక్ష్యం’ కోసమే. ఆ సినిమాకు సుమారు రూ.కోటిన్నర ఇచ్చారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’ వరకు ఆమె అంగీకరించిన సినిమాలకు రూ.కోటికి అటుఇటుగానే తీసుకుందట. ఇప్పుడు పూజ ఎందుకు పారితోషికం పెంచింది అంటూ కొంతమంది ఆలోచిస్తుంటే… దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఫేమ్‌ ఉన్నప్పుడు పారితోషికం తీసుకోవాలి అని ఇంకొందరు అంటున్నారు. ఇంతవరకూ బాగున్నా కరోనా సమయంలో పారితోషికాలు తగ్గించుకోవడానికి కొంతమంది నటీనటులు నిర్ణయాలు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో పూజ పారితోషికం పెంచేసింది అంటూ వార్తలు రావడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది.