Sports

క్యాన్సర్ నన్ను మార్చేసింది

Yuvaraj Singh On Post Cancer Cricket Experiences

టీమ్‌ఇండియా ఆల్‌టైమ్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో యువరాజ్‌ సింగ్‌ ముందుంటాడు. అతడి వల్లే భారత్‌ 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లు గెలిచింది. ఇక ధోనీసేన వన్డేల్లో రెండోసారి విశ్వవిజేతగా నిలిచినప్పుడే యూవీ ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఆపై మెరుగైన చికిత్స తీసుకొని దాన్నుంచి కోలుకొని తిరిగి టీమ్‌ఇండియాలో చేరాడు. ఇదే విషయంపై స్పోర్ట్స్‌కీడాతో ఇటీవల ముచ్చటించిన యువీ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆ పరిస్థితుల్లో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ మాటలు ఉపయోగపడ్డాయని చెప్పాడు. నిత్యం తాను లిటిల్‌మాస్టర్‌తో మాట్లాడేవాడినని, అప్పుడతని మాటలే తనకు మళ్లీ ఆడాలనే ప్రేరణ కలిగించాయని తెలిపాడు. క్యాన్సర్‌ నుంచి కోలుకున్నాక మళ్లీ దేశవాళి క్రికెట్‌లో ఆడాల్సివచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు అనుభవించారు అని అడిగిన ప్రశ్నకు మాజీ క్రికెటర్‌ ఇలా అన్నాడు. అప్పుడు తన కెరీర్‌ ఒడుదొడుకుల్లో సాగిందని, దాంతో సచిన్‌తో మాట్లాడానన్నాడు. తమ సంభాషణలో లిటిల్‌ మాస్టర్‌ కొన్ని ప్రశ్నలు వేశాడని, ‘మనమెందుకు క్రికెట్‌ ఆడతాం?ఆటపై ఉన్న ప్రేమతోనే ఆడాలనుకుంటాం. క్రికెట్‌ను ప్రేమిస్తే.. నీకు ఆడాలనిపిస్తుంది. ఒకవేళ ఇదే పరిస్థితిలో నేనుంటే నాకు కూడా ఏం చేయాలో తెలియకపోవచ్చు. కానీ ఆటమీద నీకు ఇష్టముంటే ఆడుతూనే ఉండు. అలాగే నీకు ఇష్టమొచ్చినప్పుడే రిటైరవ్వు. అది ఇతరులు నిర్ణయించకూడదు’ అని తనతో చెప్పినట్లు పేర్కొన్నాడు. సచిన్‌ అలా చెప్పిన మాటలు తనకు స్ఫూర్తి కలిగించాయని, దాంతో దేశవాళి క్రికెట్‌లో రాణించి మళ్లీ టీమ్‌ఇండియా తరఫున మూడు, నాలుగేళ్లు ఆడినట్లు వివరించాడు. ఆ సమయంలో పలు సందర్భాల్లో కీలక ఇన్నింగ్స్‌లను భారత్‌కు అందించాడు. 2014 టీ20 ప్రపంచకప్‌లో బాగా ఆడడంతో పాటు 2017లో ఇంగ్లాండ్‌తో ఆడిన ఒక వన్డేలోనూ కెరీర్‌ అత్యుత్తమ స్కోర్‌ 150 పరుగులు సాధించినట్లు యువీ వివరించాడు. కాగా, గతేడాది వన్డే ప్రపంచకప్‌లో అతడికి టీమ్‌ఇండియాలో చోటు దక్కని సంగతి తెలిసిందే. దాంతో అదే సమయంలో యువీ హాఠాత్తుగా రిటైర్మెంట్‌ ప్రకటించాడు.