Movies

నా అద్భుత ప్రతిభ వాళ్లకి తెలుసు

నా అద్భుత ప్రతిభ వాళ్లకి తెలుసు

అమితాబ్‌తో కలిసి నటించిన ‘పీకూ’ చిత్రంలోని పీకూ పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతోంది బాలీవుడ్‌ నాయిక దీపికా పదుకొణె. ఇటీవల తన అభిమానులతో సామాజిక మాధ్యమాల్లో ముచ్చటించింది దీపిక.

‘‘లాక్‌డౌన్‌ అయిపోయిన వెంటనే బెంగళూరులో ఉన్న మా అమ్మానాన్నలు, సోదరిని కలుసుకుంటా. నాలో ఉన్న అసాధారణ ప్రతిభ గురించి నాకంటే బాగా నా సోదరి, నా భర్తకు మాత్రమే బాగా తెలుసు. దక్షిణాది ఫిల్టర్‌ కాఫీ, ఛాయ్‌ని బాగా చేస్తా. ఇంకా చెప్పాలంటే టీని అద్భుతంగా పెడతా. మామిడి కాయ పచ్చడి, రసం, అన్నాన్ని జీవితాంతం తినమన్నా తింటా. మా అమ్మ చేసే అన్ని రకాల వంటలు నాకిష్టమే’ అంటూ చెప్పుకొచ్చింది. విహారయాత్రకు పర్వత ప్రాంతాలకన్నా బీచ్‌లకు వెళ్లడం ఇష్టమని తెలిపింది.

మీ భర్త రణ్‌వీర్‌ను ఏం కోరతారని ఓ అభిమాని అడగ్గా… ‘రణ్‌వీర్‌ నువ్వు ఇప్పటికే 35 వేల సార్లు గడియారాన్ని స్నూజ్‌ చేశావు. రా…వచ్చి బ్రేక్‌ఫాస్ట్‌ తిను అని చెబుతాన’ని ఫన్నీగా సమాధానం చెప్పింది దీపిక.

రణ్‌వీర్‌ నటించిన ‘83’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నా.. లాక్‌డౌన్‌తో వాయిదా పడింది. కపిల్‌ దేవ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కపిల్ దేవ్‌ భార్య రోమి భాటియా పాత్రలో దీపికా పదుకొణె నటించింది. తెలుగు సినీ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ చేయబోతున్న 21వ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించబోతున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో దీపిక నేరుగా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది.