Sports

ఇండియాకు చుక్కలు చూపెట్టిన జయసూర్య

When Sanath Jayasurya Made 340 Runs Against India

ఒకప్పుడు టెస్టు క్రికెటే అసలైన క్రికెట్‌. ఐదు రోజుల ఆటలో ఎన్ని మలుపులు తిరగాలో అన్ని తిరిగేవి. ఆటగాళ్లు నిలకడగా ఆడుతూ, ఎండలో ఓపిగ్గా నిలవాలంటే అంత తేలిక కాదు. అయినా అలాగే ఆడుతూ ఎన్నో రికార్డులు నమోదు చేశారు. ఇక బ్యాట్స్‌మన్‌ క్రీజులో అతుక్కుపోయాడంటే ప్రత్యర్థి బౌలర్లకు విసుగు పుట్టాల్సిందే. ఆ క్రమంలోనే శతకాలు, ద్విశతకాలతో పాటు చాలా అరుదుగా త్రిశతకాలూ నమోదయ్యేవి. దాంతో మ్యాచ్‌ గెలవడం అటుంచితే ఆటగాళ్లు డ్రా చేసుకోడానికే ప్రధాన్యమిచ్చేవారు. అప్పుడు స్కోరు బోర్డులు 500, 600, ఒక్కోసారి 700 కూడా దాటేవి. అయితే, టీమ్‌ఇండియాపై శ్రీలంక చేసిన ఆ స్కోర్‌.. టెస్టు క్రికెట్‌లోనే అత్యధిక పరుగులుగా నిలిచిపోయింది. అది జరిగి నేటికి 23 ఏళ్లు పూర్తయ్యాయి. నాటి విశేషాలేంటో మీరూ తెలుసుకోండి. 1997లో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ నేతృత్వంలో టీమ్‌ఇండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది. అప్పుడు ప్రేమదాస మైదానంలో జరిగిన తొలి టెస్టులో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆదిలోనే నయన్‌ మోంగియా ఔటైనా మరో ఓపెనర్‌ నవజోత్‌సింగ్‌ సిద్ధూ (111), రాహుల్‌ ద్రవిడ్‌(69) జట్టును ఆదుకున్నారు. తర్వాత సచిన్‌ తెందూల్కర్‌(143), మహ్మద్‌ అజహరుద్దీన్‌(126) కూడా శతకాలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో 167.3 ఓవర్లు ఆడాక భారత్‌ 537/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అప్పటి శ్రీలంక స్టార్‌ ఆటగాడు సనత్‌ జయసూర్య 3 వికెట్లు తీశాడు.

టీమ్‌ఇండియా భారీ స్కోర్‌ సాధించడంతో లంక గట్టిగానే బదులిచ్చింది. మిగిలిన అన్ని రోజులూ వాళ్లే ఆడేసి మ్యాచ్‌ను డ్రా చేసుకున్నారు. ఈ క్రమంలోనే టెస్టు చరిత్రలో అత్యధిక స్కోర్‌ సాధించారు. ఇంకో 48 పరుగులు చేసి ఉంటే మాత్రం పెద్ద సెన్సేషన్‌ అయ్యుండేది. అంతలా రెచ్చిపోయిన ఆ జట్టు చివరికి 952/6 స్కోర్‌ సాధించింది. సనత్‌ జయసూర్య(340), రోషన్‌ మహానామా(225), క్రీజులో పాతుకుపోయి రికార్డు స్థాయి భాగస్వామ్యం నెలకొల్పారు. 39 పరుగుల వద్ద తొలి వికెట్‌ పడగా, రెండో వికెట్‌ పడేసరికి ఆ జట్టు స్కోర్‌ 615కి చేరింది. అంటే రెండో వికెట్‌కు వారిద్దరూ జోడించిన పరుగులు 576 పరుగులు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతిపెద్ద భాగస్వామ్యాల్లో ఒకటి. అనంతరం అరవింద డిసిల్వ(126) శతకం బాదగా కెప్టెన్‌ అర్జున రణతుంగా (86), మహేలా జయవర్ధనే(66) అర్ధ శతకాలతో రాణించారు.

*** టెస్టుల్లో ఇతర అత్యధిక స్కోర్లు చేసిన జట్లు..
*ఇంగ్లాండ్‌ ఆస్ట్రేలియాపై 903/7 డిక్లేర్డ్‌. ఇంగ్లిష్‌‌ జట్టు ఇన్నింగ్స్‌ 579 పరుగులతో ఘన విజయం సాధించింది.
*ఇంగ్లాండ్‌ వెస్టిండీస్‌పై 849 పరుగులు. మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.
*వెస్టిండీస్‌ పాకిస్థాన్‌పై 790/3 డిక్లేర్డ్‌. ఇన్నింగ్స్‌ 174 పరుగులతో వెస్టిండీస్‌ విజయం.
*పాకిస్థాన్‌ శ్రీలంకపై 765/6 డిక్లేర్డ్‌. మ్యాచ్‌ డ్రా.
*శ్రీలంక టీమ్‌ఇండియాపై760/7 డిక్లేర్డ్‌. మ్యాచ్‌ డ్రా.
*టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌పై 759/7 డిక్లేర్డ్‌. ఇన్నింగ్స్‌ 75 పరుగుల తేడాతో భారత్‌ విజయం. టెస్టుల్లో భారత్‌కు ఇదే అత్యధిక ఇన్నింగ్స్‌ స్కోర్‌. దీని తర్వాత శ్రీలంకపై మరోసారి 726/9 స్కోర్‌ చేసింది. ఆ మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 24 పరుగుల తేడాతో గెలుపొందింది.