Politics

జగన్ సర్కార్‌పై కేసీఆర్ గుస్సా

జగన్ సర్కార్‌పై కేసీఆర్ గుస్సా

తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌ అర్థం పర్థంలేని నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల విషయంలో ఏపీ ఫిర్యాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తోందని విమర్శించారు. నీటిపారుదల శాఖపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర జలశక్తిశాఖ మంత్రి లేఖ, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంపై చర్చించారు. అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని అధికారులకు సూచించారు. వాస్తవాలు, సంపూర్ణ సమాచారంతో కేంద్రం, ఏపీకి బలంగా సమాధానం చెప్పాలన్నారు. ‘‘నా అంతట నేనే ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడా. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మిద్దామని చెప్పాం. బేసిన్లు, భేషజాలు లేవని రాష్ట్ర వైఖరిని చాలా స్పష్టంగా చెప్పా. వృథాగా పోతున్న నీటిని పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామన్నాను. కానీ ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోంది. ఏపీ అర్థరహిత వాదనలు తిప్పికొట్టేలా సమాధానం చెబుతాం. రాష్ట్ర ప్రాజెక్టులపై మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఏపీకి కల్పిస్తాం’’అని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణకు ఉన్న వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందే అనుమతులు పొందిన ప్రాజెక్టులపై అభ్యంతరాలు సరికాదని చెప్పారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటి విడుదలలో కేంద్రం అభ్యంతరం చెబుతోందని మండిపడ్డారు. వాస్తవాలు పరిగణనలోకి తీసుకోకుండా అభ్యంతరాలు వ్యక్తం చేయడం, రాష్ట్రాల హక్కులు హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదన్నారు. కేంద్రం వైఖరిని యావత్‌ దేశానికి తెలిసేలా చేస్తామని, వాస్తవాలు వెల్లడిస్తామని కేసీఆర్‌ చెప్పారు.