Politics

తెలంగాణాలో అత్యధికంగా కరోనా పరీక్షలు

తెలంగాణాలో అత్యధికంగా కరోనా పరీక్షలు

తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర సీఎం కేసీఆర్‌.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలిపారు. మంగళవారం సీఎంలతో ప్రధాని నిర్వహించిన సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచామని చెప్పారు. కరోనా రికవరీ రేటు 71శాతం, మరణాల రేటు 0.7శాతం ఉందన్నారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. పడకలు, మందులు, ఇతర పరికరాలు, సామగ్రి సిద్ధంగా ఉంచామని, ఐసీఎంఆర్‌, నీతిఆయోగ్‌, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నామని ప్రధానికి వివరించారు. కేంద్రానికి సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. కరోనా అనుభవాల దృష్ట్యా దేశంలో వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టాలన్నారు. దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరాన్ని కరోనా గుర్తుచేసిందన్నారు. ‘‘కరోనా అనుభవాలు మనకు పాఠం నేర్పాయి. గతంలో మనకు కరోనాలాంటి అనుభవం లేదు. అందుకే ఇప్పుడు సమగ్ర వైద్య సదుపాయాల కోసం ప్రణాళిక రూపొందించాలి. కేంద్రం, రాష్ట్రాలు కలిసే ఈ ప్రణాళిక అమలు చేయాలి. కరోనా వైరస్‌లాంటివి భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశముంది. వైద్య రంగంలో ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా తట్టుకునేలా చర్యలు తీసుకోవాలి. జనాభా నిష్పత్తి ప్రకారం వైద్యులను నియమించడంతో పాటు, వైద్య కళాశాలల ఏర్పాటుపై ఆలోచించాలి. వైద్య రంగం బలోపేతానికి ప్రధాని మోదీ చొరవ తీసుకోవాలి’’అని కేసీఆర్‌ కోరారు.