ScienceAndTech

కొత్త పార్లమెంట్ కట్టేది ఎవరు?

కొత్త పార్లమెంట్ కట్టేది ఎవరు?

కొత్త పార్లమెంటు భవనం… రేసులో మూడు దిగ్గజ సంస్ధలు..

ఢిల్లీలో కేంద్రం నిర్మించ తలపెట్టిన కొత్త పార్లమెంటు భవన నిర్మాణ ప్రక్రియ ఆర్ధిక బిడ్ దశకు చేరుకుంది. దేశంలో మూడు కీలక దిగ్గజ సంస్ధలు ఎల్‌ అండ్‌ టీ, షాపూర్‌ జీ పల్లోంజీ అండ్‌ కో, టాటా ప్రాజెక్ట్స్‌ ఫైనాన్షియల్ బిడ్‌కు అర్హత సాధించాయి. మొత్తం ఏడు సంస్ధలు ఫైనాన్షియల్ బిడ్‌ కోసం పోటీ పడ్డాయి. ఇందులో ఈ మూడు అర్హత సాధించినట్లు కేంద్ర ప్రజా పనుల శాఖ వర్గాలు తెలిపాయి.

ఢిల్లీలో కేంద్రం చేపట్టిన సెంట్రల్ విస్తా ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనానికి సమీపంలోనే కొత్త పార్లమెంటు భవనం నిర్మాణాన్ని కేంద్ర ప్రజా పనుల శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది. రూ.889 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించేందుకు కేంద్రం ఇప్పటికే అంగీకారం తెలిపింది. కేవలం 21 నెలల కాలంలో కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం పూర్తి చేసుకోనుంది. పార్లమెంటు హౌస్ ఎస్టేట్ లోని ప్లాట్‌ నంబర్ 118లో ఈ కొత్త భవనం రూపుదిద్దుకోనుంది. రీ ఇన్ఫోర్సెడ్ కాంక్రీట్ విధానంలో దీన్ని నిర్మించనున్నారు. ప్రస్తుత పార్లమెంటు భవనం తరహాలోనే భూమికి 1.8 అడుగుల ప్లింత్‌తో 65 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ కొత్త భవనాన్ని నిర్మిస్తారు.

కొత్త పార్లమెంటు భవన నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్దం చేసిన కేంద్ర ప్రజా పనుల శాఖ.. ఈ భవనం నిర్మాణం పూర్తయ్యే వరకూ ప్రస్తుత పార్లమెంటు భవనంలో కార్యకలాపాలు కొనసాగుతాయని ఇప్పటికే ప్రకటించింది. పార్లమెంటు కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం లేకుండా దీని నిర్మాణం చేపట్టనున్నారు.