Fashion

అంధురాలే గానీ సివిల్స్‌ను అధిగమించింది

అంధురాలే గానీ సివిల్స్‌ను అధిగమించింది

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇటీవలే సివిల్స్ తుది ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాల్లో తమిళనాడుకు చెందిన పురాణ సుందరి 286వ ర్యాంక్ సాధించింది. అసలు విషయం ఏంటంటే, 25 ఏళ్ల పురాణ సుందరికి చూపు లేదు. ఆమె వినికిడి ద్వారానే విషయాలను గ్రహించగలదు. కేవలం ఆడియో పాఠాలు విని ఆమె సివిల్స్ లో ఉత్తీర్ణురాలవడం దేశవ్యాప్తంగా అనేకమందిని అచ్చెరువొందించింది. టీమిండియా మాజీ ఆటగాడు, ఫీల్డింగ్ దిగ్గజం మహ్మద్ కైఫ్ కూడా పురాణ సుందరి ఘనతను కొనియాడారు. ట్విట్టర్ లో తన స్పందన తెలియజేశారు. “తమిళనాడుకు చెందిన పాతికేళ్ల పురాణ సుందరి పరిస్థితులకు ఎదురొడ్డి యూపీఎస్సీ నియామకాల్లో ర్యాంకు సాధించింది. ఆడియో పాఠాలు దొరకడమే కష్టమైన కాలంలో ఆమెకు తల్లిదండ్రులు, స్నేహితులే అండగా నిలిచారు. పుస్తకాలను ఆడియో పాఠాల రూపంలో మలిచి సాయపడ్డారు. ఆ విధంగా ఎంతో కష్టపడిన పురాణ సుందరి ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అధికారిణి అవుతోంది. మీ కలలను సాకారం చేసుకునే క్రమంలో ఎప్పుడూ పరుగును ఆపొద్దు” అంటూ కైఫ్ పేర్కొన్నారు. తమిళనాడులోని మధురై ప్రాంతానికి చెందిన పురాణ సుందరి సివిల్స్ రాయడం ఇది నాలుగోసారి. తన నాలుగో ప్రయత్నంలో ఆమె మెరుగైన ర్యాంకును అందుకుని తన కలను నిజం చేసుకున్నారు. ఈ పరీక్షలో నెగ్గడానికి ఐదేళ్ల పాటు కృషి చేశానని, ఈ విజయాన్ని తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నానని, వారు తనకోసం ఎంతో కష్టపడ్డారని పురాణ సుందరి మీడియాకు తెలిపారు.