DailyDose

లాభాల్లో దేశీయ మార్కెట్లు-వాణిజ్యం

లాభాల్లో దేశీయ మార్కెట్లు-వాణిజ్యం

* మైక్రోమ్యాక్స్‌.. ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఓ వెలుగు వెలిగిన దేశీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ. ఓ దశలో దక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్‌కు సైతం చెమటలు పట్టించిన ఆ కంపెనీ.. చైనా ఫోన్ల ప్రవేశంతో తన ప్రాభవాన్ని కోల్పోయింది. కంపెనీనే జనం మరిచిపోయే దశకు చేరింది. ఈ నేపథ్యంలో భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆ కంపెనీ సిద్ధమైంది. త్వరలోనే కొన్ని ఫోన్లను లాంచ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

* దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సోమవారం ఉదయం ప్రారంభమైన మార్కెట్లు ఆద్యంతం ఒడుదొడుకులకు లోనయ్యాయి. చివరికి సెన్సెక్స్‌ 173 పాయింట్ల లాభంతో 38,050.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 69 పాయింట్లు లాభపడి 11,247.10 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.88గా ఉంది.

* గూగుల్‌ ప్రోడక్ట్స్‌లో బాగా పాపులర్‌ అయిన రెండు యాప్‌లు కలవబోతున్నాయా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ టెక్‌ వర్గాలు. వీడియో కాల్స్‌తో ఫేమస్‌ అయిన గూగుల్‌ డ్యుయో… వీడియో కాన్ఫరెన్స్‌, ఆన్‌లైన్‌ క్లాస్‌లతో అందరికీ సుపరిచితమైన గూగుల్‌ మీట్‌ సర్వీసులను కలిపేయాలని గూగుల్‌ అనుకుంటోందట. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.

* చిన్న పొరపాటు సిటీ బ్యాంకుకు ముచ్చెమటలు పట్టించింది. ఈ బ్యాంకు న్యూయార్క్‌ శాఖలో 900 మిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.6700 కోట్లు తప్పుడు ఖాతాలోకి వెళ్లిపోయాయి. కరోనా వైరస్‌ కారణంగా వ్యాపారం దెబ్బతిన్న సౌందర్యోత్పత్తుల సంస్థ రెవ్లాన్‌‌, వివిధ రుణదాతలకు సుమారు 3 బిలియన్‌ డాలర్ల మేరకు బకాయి పడింది. కాగా, సకాలంలో చెల్లింపు జరగక పోవటంతో రుణాలిచ్చిన సంస్థలు తీవ్ర అసహనానికి గురయ్యాయి. టర్మ్‌లోన్‌ను 2023లోగా తిరిగి చెల్లించాలని డిమాండు చేస్తూ రెవ్లాన్‌పై కేసులు వేసాయి. ఈ కేసులో సిటీ బ్యాంకును కూడా ప్రతివాదిగా చేర్చాయి. ఈ నేపథ్యంలో సిటీ బ్యాంకు 900 మిలియన్‌ డాలర్ల మొత్తాన్ని పొరపాటున రెవ్లాన్‌ ఖాతా నుంచి రుణదాతల ఖాతాల్లో జమ చేసింది. తమ బకాయిలు తిరిగి వచ్చే ఆశలకు నీళ్లొదులుకున్న దశలో లభించిన ఈ మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు రుణాలిచ్చిన సంస్థలు తిరస్కరించాయి. అసలే అసహనంగా ఉన్న బకాయిదారులకు, రెవ్లాన్‌కు మధ్య చోటుచేసుకున్న వివాదానికి.. బ్యాంకు తాజా వ్యవహారం అజ్యం పోసింది.