WorldWonders

కోడి కూసినందుకు ₹15వేల జరిమానా

కోడి కూసినందుకు ₹15వేల జరిమానా

పల్లెటూళ్లలో తెల్లవారుజామున కోడిపుంజులు ‘కొక్కొరకో’ అంటూ కూయడం చూసే ఉంటారు. ఇప్పటికీ గ్రామాల్లో వాటి కూత వినపడగానే నిద్ర లేస్తుంటారు. కానీ ఒకాయన తన పెంచుకుంటున్న కోడిపుంజు కూసినందుకు 15వేల రూపాయాలు జరిమానా కట్టాడు. విడ్డూరంగా అనిపించే ఈ సంఘటన ఇటలీలో జరిగింది.
ఇటలీలోని కాస్టిరాగా విదార్డో అనే పట్టణంలో 83 ఏళ్ల ఏంజెలో బొలెట్టి అనే వృద్ధుడు నివసిస్తున్నాడు. ఆయన ఇంట్లో ఓ కోడిపుంజు ఉంది. అది ప్రతిరోజూ ఉదయం నాలుగున్నరకు ‘కొక్కొరకో’ అని కూసేది.
ఉదయాన్నే ఆ కోడిపుంజు కూయడం వల్ల ఇరుగుపొరుగు వారికి నిద్రపట్టేది కాదు. మంచి నిద్రలో ఉన్న వారిని కోడిపుంజు కూత బాగా ఇబ్బంది పెట్టేది. దాంతో వాళ్లు బొలెట్టికి ఆ విషయంపై చాలాసార్లు ఫిర్యాదు చేశారు. అయినా ఆ కోడిపుంజు ఉదయాన్నే కూస్తుండడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు.
కోడిపుంజు కూయకుండా చూడడంంలో విఫలమైనందుకు అధికారులు ఆయనకు 15 వేల రూపాయల జరిమానా విధించారు. అక్కడి నిబంధనల ప్రకారం జంతువులు, పక్షులను ఇరుగు పొరుగు వారి ఇళ్లకు కనీసం 10 మీటర్ల దూరంలో ఉంచాలి.