WorldWonders

ప్రపంచానికి కరోనా అంటించి…స్విమ్మింగ్ పూల్స్‌లో వూహాన్ ప్రజల ఆటలు

ప్రపంచానికి కరోనా అంటించి…స్విమ్మింగ్ పూల్స్‌లో వూహాన్ ప్రజల ఆటలు

కరోనా వైరస్‌కు కేంద్రబిందువైన వుహాన్‌లో వాటర్‌ పార్కులు కిక్కిరిసిపోతున్నాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో వేలమంది పార్టీలకు హాజరవుతున్నారు. ముఖ్యంగా వారాంతంలో నిర్వహించే వాటర్‌ పార్కులకు జనం పోటెత్తుతున్నారు. తాజాగా వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమివ్వడంతో నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. కరోనా వైరస్‌కు కేంద్రబిందువైన వుహాన్‌లో కనీసం మాస్కులు ధరించకుండా వేలమంది పార్టీల్లో పాల్గొనడం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మహమ్మారి తొలిసారి వుహాన్‌లోనే బయటపడ్డ విషయం తెలిసిందే. తాజాగా అక్కడ ఆంక్షలు సడలించడంతో ప్రజలు సామూహిక పార్టీలకు ఎగబడుతున్నారు. ముఖ్యంగా అక్కడి వాటర్‌ పార్కులు వేలమంది సందర్శకులతో కనిపిస్తున్నాయి. వుహాన్‌లో దాదాపు మూడు నెలల లాక్‌డౌన్‌ అనంతరం సందర్శకులను ఆకర్షించేందుకు వాటర్‌ పార్కులు ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించాయి. దీంతో భారీసంఖ్యలో సందర్శకులు వాటర్‌ పార్కుల్లోని పార్టీల్లో పాల్గొంటున్నారు. స్టేజీ నృత్యాలు, కేరింతలతో వుహాన్‌లోని ఓ వాటర్‌ పార్క్‌ మారుమోగిపోయిందని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ పార్టీలో పాల్గొన్నవారు కనీస భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం ప్రస్తుతం విమర్శలకు తావిస్తోంది. అయితే హుబే ప్రావిన్సులో మే నెలనుంచి కొత్తగా కరోనా కేసులు నమోదుకాకపోవడం వల్లే లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించినట్లు అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా ఊతమిచ్చేందుకు దాదాపు 400 పర్యాటక ప్రాంతాల్లో ఉచిత ప్రవేశాన్ని హుబే అధికారులు ప్రకటించారు. ఇదిలాఉంటే, చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా మహమ్మారి ఇప్పటికే లక్షల మందిని బలితీసుకోవడంతోపాటు కోట్లమందికి సోకింది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ వైరస్‌ కేసులు చైనాలోనూ మరోసారి బయటపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే రెండో దఫా వైరస్‌ ముప్పు తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అంతర్జాతీయ నిపుణులు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ సమయంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా కఠిన నిబంధనలు అమలు చేస్తోన్న నేపథ్యంలో వుహాన్‌వాసుల, అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది.