ScienceAndTech

దుర్గమ్మ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం

దుర్గమ్మ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం

విజయవాడ వాసుల చిరకాల స్వప్నం త్వరలో నెరవేరనుంది. నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. బెజవాడకు మణిహారంగా రూపుదిద్దుకున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 4న విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్‌ను ప్రారంభించబోతున్నట్లు మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులను మంత్రి శంకర్ నారాయణ పరిశీలించారు. ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుతో కలిసి ఫ్లై ఓవర్ పనులను మంత్రి తనిఖీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. దుర్గ గుడి ఫ్లై ఓవర్ దాదాపు పూర్తైందని చెప్పారు. చిన్న చిన్న పనులను ముగించి వచ్చే నెల 4న ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కనకదుర్గ వారధి, బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్‌ను వచ్చే నెల 4న ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. వచ్చే నెల 4న ఆర్ అండ్ బీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన 13 వేల కోట్ల రూపాయల పనులకు కేంద్ర‌మంత్రి గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని వెల్లడించారు. ఒక వైపు సంక్షేమం.. మరోవైపు రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శంకర్ నారాయణ స్పష్టం చేశారు.