ScienceAndTech

నీట్ పరీక్ష నూతన నిబంధనలు ఇక్కడ చదవండి

నీట్ పరీక్ష నూతన నిబంధనలు ఇక్కడ చదవండి

నీట్‌ 2020 పరీక్షకు సంబంధించి పరీక్ష కేంద్రాల వివరాలను ఎన్‌టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 13న జరగబోయే.. నీట్‌ (National Eligibility cum Entrance Test ) 2020 పరీక్షకు సంబంధించి పరీక్ష కేంద్రాల వివరాలను ఎన్‌టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) విడుదల చేసింది.

అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ https://ntaneet.nic.in/లో చూసుకోవచ్చు.

పరీక్షకు సంబంధించి హాల్‌టికెట్లను త్వరలో జారీ చేయనున్నారు. పరీక్ష రాసే నగరాలను మార్చుకునేందుకు ఈ దఫా విద్యార్థులకు అయిదు సార్లు జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) అవకాశం కల్పించింది.

మొత్తం విద్యార్థుల్లో 99.87 శాతం మంది తమ మొదటి ఛాయిస్‌గా ఎంచుకున్న నగరం/పట్టణంలోనే పరీక్ష రాయనున్నారు.

నీట్‌ 2020కు పెరిగిన పోటీ: వైద్య విద్యలో ప్రవేశానికి దేశవ్యాప్తంగా సెప్టెంబరు 13న నిర్వహించనున్న నీట్‌(యూజీ)-2020కు మొత్తం 15,97,433 మంది హాజరుకానున్నారు.

గత ఏడాది 15,51,753 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ సారి మరో 45,680 మంది అధికంగా పోటీ పడనున్నారు.

కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా:

పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుండగా.. కరోనా నేపథ్యంలో విద్యార్థులందరూ గుంపుగా రాకుండా స్లాట్ల విధానం అమలు చేస్తున్నారు.

దీంతో ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

ఎవరు ఏ సమయంలో రావాలో హాల్‌టికెట్లపై ముద్రిస్తారు.

విద్యార్థుల సెల్‌ఫోన్లకు వివరాలను మేసేజ్‌ రూపంలో పంపిస్తారు.

పరీక్ష కేంద్రాల వద్ద గుమిగూడకుండా గేటు బయట భౌతిక దూరం పాటించేందుకు తాళ్లు కట్టనున్నారు.

వాటి వరుసల మధ్య నుంచే విద్యార్థులు లోపలికి ప్రవేశించేలా ఏర్పాట్లు చేయనున్నారు.