Movies

మధ్యతరగతి అనారోగ్యాలకు ఉపాసన చెక్

మధ్యతరగతి అనారోగ్యాలకు ఉపాసన చెక్

మనిషి జీవితంలో అత్యంత విలువైనదిగా భావించేది ప్రాణం. అందుకే ఏ చిన్న పాటి అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే ఆస్పత్రికి వెళ్లే వారు కోకొల్లలు. చాలా మంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటారు. కరోనా వచ్చాక మనలో ఆరోగ్య స్పృహ బాగా పెరిగిందనే చెప్పవచ్చు. హెల్త్‌ పాలసీలు తీసుకునే వారిలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారే అధికం. ఎందుకంటే వారు గవర్నమెంట్‌ ఆస్పత్రులకు వెళ్లలేరు.. లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్‌ హస్పటిల్‌కు వెళ్లే ధైర్యం కూడా చేయలేరు. దాంతో మధ్యే మార్గంగా ఆరోగ్యబీమా పాలసీలతో నెట్టుకొస్తుంటారు. ఈ క్రమంలో మెగాస్టార్‌ కోడలు ఉపాసన ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. బీమా కంపెనీలు, ప్రభుత్వంతో కలిసి మధ్య తరగతి వారికి ఉపయోగపడే హెల్త్‌కేర్‌ కవరేజ్‌ మోడల్‌ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఉపాసన ట్వీట్‌ చేశారు. ‘అందరికి అనువైన ఆరోగ్య సంరక్షణ.. 50 కోట్ల మంది భారతీయులకు అనువైన ఉత్తమమైన హెల్త్‌కేర్‌‌ కవరేజ్‌ నమూనాను అభివృద్ధి చేయడానికి బీమా సంస్థలు, ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు తెలపడమే కాక ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. జై హింద్’‌ అంటూ ఉపాసన ట్వీట్‌ చేయడమే కాక ఓ వీడియో విడుదల చేశారు. దీనిలో ‘దాదాపు 50 కోట్ల మంది భారతీయులు ఆరోగ్య సమస్యల వల్ల పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. అందరికి అనువైన హెల్త్‌కేర్‌ పాలసీని తీసుకురావాలని భావిస్తున్నాం’ అంటూ ఇన్యూరెన్స్‌ కంపెనీ ఎఫ్‌హెచ్‌పీఎల్‌ని ట్యాగ్‌ చేశారు ఉపాసన. 65 లక్షల మందికి ఆరోగ్య సేవలను కల్పించే ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన స్కీమ్‌లో భాగసస్వామ్యం కావడం గర్వంగా ఉంది’ అన్నారు.