Sports

అమెరికాలో కుటుంబాన్ని హత్య చేసిన భారత అథ్లెట్

అమెరికాలో కుటుంబాన్ని హత్య చేసిన భారత అథ్లెట్

భారత్‌ తరపున ఆసియా క్రీడల్లో కాంస్యపతకం సాధించిన అథ్లెట్‌ ఇక్బాల్‌ సింగ్‌ అమెరికాలో జరిగిన హత్యకేసులో అరెస్టు అయ్యారు. తన భార్య, తల్లిని హత్య చేసినట్లు ఇక్బాల్‌ అంగీకరించాడని స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. 62ఏళ్ల ఇక్బాల్‌ డెల్వార్‌ కౌంటీలో నివాసం ఉంటున్నారు. ఆయన ఆదివారం పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించాడు. ఆదివారం పోలీసులు ఇక్బాల్‌ ఇంటికి వెళ్లేసరికి అతని శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయి. విపరీతంగా రక్తం కారుతోంది. అదే ఇంట్లో రెండు మృతదేహాలు దొరికాయి. సింగ్‌కు అయిన గాయాలు సొంతంగా చేసుకొన్నవే అని పోలీసులు తెలిపారు. క్రూరంగా హత్య చేయడం వంటి అభియోగాలాను మోపి అతడిపై కేసు నమోదు చేశారు. నేరాల తీవ్రత చూస్తే బెయిల్‌ కూడా వచ్చే అవకాశం లేదు. సింగ్‌ ఇంట్లో వారిద్దరిని హత్య చేశాక.. తన కుమారుడికి ఫోన్‌ చేసి..‘‘ వారిద్దరిని చంపేశాను. మీ అమ్మ.. నానమ్మని హత్యచేశాను. పోలీసులను వచ్చి అరెస్టు చేయమని చెప్పు’’ అని పేర్కొన్నాడు. హత్యకు గల కారణాలు తెలియలేదు. ఇక్బాల్‌ 1983లో కువైట్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్‌ ఛాంపియన్‌ షిప్‌లో షాట్‌పుట్‌లో కాంస్యపతకం సాధించాడు. ఆ తర్వాత అతడు అమెరికా వెళ్లి స్థిరపడ్డాడు.