Politics

ఆజాద్ సరికొత్త ప్రణాళిక

ఎన్నికల ద్వారా నియమితులైన వ్యక్తులను తొలగించడం కుదరదు
అలా ఎన్నుకోకుంటే మరో 5 దశాబ్దాలపాటు ప్రతిపక్షంలోనే
రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరినీ అలానే ఎన్నుకోవాలి

కాంగ్రెస్ నాయకత్వం విషయంలో పార్టీలో ఏర్పడిన తీవ్ర గందరగోళం నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరో ఒకరిని అధ్యక్షుడిగా నియమించడం కంటే ఎన్నికల ద్వారానే అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించారు. అలా ఎన్నికైన వ్యక్తులను తొలగించడం సాధ్యం కాదన్నారు. నేరుగా నియమించే వ్యక్తికి ఒక్కశాతం మద్దతు కూడా ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఎన్నికల ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకోకుంటే పార్టీ మరో 5 దశాబ్దాలపాటు ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవితోపాటు రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయి అధ్యక్షుల వరకు అన్ని కీలక పదవులను ఎన్నికల ద్వారానే భర్తీ చేయాలని ఆజాద్ సూచించారు. ఈ విధానాన్ని ఎవరైనా వ్యతిరేకించారంటే దానర్థం వారు ఓటమికి భయపడుతున్నారనే అర్థమన్నారు. కాగా, సోనియాకు లేఖ రాసిన 23 నేతల్లో ఆజాద్ కూడా ఒకరు.