ScienceAndTech

మార్క్ జూకర్‌బర్గ్‌కు కాంగ్రెస్ లేఖ

మార్క్ జూకర్‌బర్గ్‌కు కాంగ్రెస్ లేఖ

బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్‌బుక్‌ చూసీచూడనట్లుగా వదిలేస్తోందనే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం సృష్టించిన రాజకీయ వేడి ఇప్ప‌ట్లో చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. విద్వేష కంటెంట్‌ను నిరోధించేందుకు ఫేస్‌బుక్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుందో వివ‌ర‌ణ కోరుతూ ఎఫ్‌బీ చీఫ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌కు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక ఫేస్‌బుక్ ఖాతాదారులున్న భారత్‌లో హింసను ప్రేరేపించేలా ఉన్న ప్ర‌సంగాలను ఫేస్‌బుక్ నియంత్రించ‌డం లేదంటూ గ‌త ప‌క్షం రోజుల్లో కాంగ్రెస్ లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వాట్సాప్ సంస్థ‌ను కూడా బీజేపీ త‌న గుప్పిట్లో పెట్టుకుంద‌ని పార్టీ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ సంతకంతో కూడిన కాంగ్రెస్‌ లేఖ స్పష్టం చేసింది. ప్రాణాలను పణంగా పెట్టి నెలకొల్పిన విలువలు, హక్కులకు పాతరవేయడంలో ఫేస్‌బుక్‌ ఉద్దేశపూర్వకంగానే భాగస్వామిగా మారిందని, అయితే ఇప్పటికీ దిద్దుబాటు చర్యలకు సమయం మించిపోలేదని జుకర్‌బర్గ్‌కు రాసిన లేఖలో పేర్కొంది. హేట్‌ స్పీచ్‌ పాలసీకి విరుద్ధంగా భారత్‌లో పాలక బీజేపీకి ఫేస్‌బుక్‌ దాసోహమైందని కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగ‌తి తెలిసిందే.