Politics

మోడీ నిధికి ₹3076కోట్లు

మోడీ నిధికి ₹3076కోట్లు

ఈ ఏడాది మార్చి 31 వరకూ పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.3,076 కోట్లు జమ అయినట్టు ప్రభుత్వం ఒక ఆడిట్ నివేదికలో తెలిపింది. అయితే, మార్చి తర్వాత వచ్చిన డొనేషన్లు వెల్లడించలేదు. పీఎం కేర్స్ ఫండ్ వెబ్‌‍సైట్‌లో ఈ వివరాలు ఉంచారు. తుది బాలెన్స్ 3,076 కోట్లు కాగా, ఈ మొత్తంలో రూ.3,075.85 కోట్లు దేశీయ కంట్రిబ్యూషన్‌గా, 39.67 లక్షలు విదేశీ కంట్రిబ్యూషన్‌గా పేర్కొంది. దాతల వివరాలను మాత్రం ఇంకా బహిర్గతం చేయలేదు.దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఓ ట్వీట్‌లో స్పందించారు. ఉదారంగా విరాళిలిచ్చిన వారి పేర్లు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. ఎన్‌జీఓలు, ఇతర ట్రస్టులు తమకు విరాళిలిచ్చిన వారు పేర్లు తప్పని సరిగా వెల్లడించాల్సి ఉన్నప్పుడు, పీఎం కేర్స్ ఫండ్‌ను ఎందుకు ఈ నిబంధన నుంచి మినహాయించారని నిలదీశారు. డోనర్ల పేర్లు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పీఎం కేర్స్ ఫండ్ విషయంలో మరింత పారదర్శకత ఉండాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తుండగా, నిధుల వివరాలు తెలియజేయాలంటూ పలు పిటిషన్లు కోర్టుల్లో దాఖలు అయ్యాయి. లాక్‌డౌన్ ప్రకటించిన మూడు రోజుల తర్వాత అంటే గత మార్చి 27న ప్రధాని మోదీ సారథ్యంలో పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటయింది. ట్రస్టులో ఇతర ఎక్స్ అఫీషియో సభ్యులుగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు.ఇటీవల సుప్రీంకోర్టు పీఎం కేర్స్ ఫండ్ నిధులను ఎన్‌డీఆర్ఎఫ్‌కు బదిలీ చేయాల్సిన అవసరం లేదని, ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు వ్యక్తులెవరైనా స్వచ్ఛంధంగా విరాళాలు ఇవ్వొచ్చని పేర్కొంది. పీఎం కేర్స్ నిధులన్నీ ఎన్‌డీఆర్ఎఫ్‌కు బదిలీ చేయాలన్న పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.