Editorials

150కోట్లు దాటనున్న భారత జనాభా

150కోట్లు దాటనున్న భారత జనాభా

2036లో దేశ జనాభా 151.8 కోట్లు
*ప్రజల సగటు వయసులో పెరుగుదల
*జననాల్లో చివరన నిలవనున్న ఆంధ్రప్రదేశ్‌
*****వచ్చే 16 ఏళ్లలో మన దేశ జనాభా 151.8 కోట్లకు చేరే అవకాశం ఉన్నట్లు జనాభా వృద్ధి రేటు అంచనాలు చెబుతున్నాయి. 2011లో మన జనాభా 121.1 కోట్లు. ఇది ఏటా 1% చొప్పున వృద్ధి చెందడం వల్ల దేశంలో జన సాంద్రత చదరపు కిలోమీటరుకు 368 నుంచి 462కి పెరగనుంది. ఇదే సమయంలో సంతాన సాఫల్యత తగ్గడం వల్ల ఒక ప్రాంతంలో ఒక ఏడాదిలో ప్రతి వెయ్యి మంది జనాభాకు అదనంగా చేరే శిశువుల సంఖ్య (క్రూడ్‌ బర్త్‌ రేట్‌) 19.6 నుంచి 13కి తగ్గిపోనుంది. ఒక ప్రాంతంలో ప్రతి లక్ష మందిలో చనిపోయేవారి సంఖ్య (క్రూడ్‌ డెత్‌ రేట్‌) స్వల్పంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జనాభా వృద్ధిలో పట్టణాల నుంచే 73% ఉంటుంది.
* 2011-36 మధ్య 31 కోట్ల జనాభా పెరగనుండగా అందులో 17 కోట్ల వృద్ధి ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్‌లనుంచే ఉంటుంది. యూపీలోనే 19% వృద్ధి నమోదు కానుంది.
***తెలుగు రాష్ట్రాల్లో వృద్ధి తక్కువే
ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తెలంగాణ, తమిళనాడుల్లో 2.9 కోట్ల జనాభా పెరగనుంది. దేశ జనాభా వృద్ధిలో ఈ రాష్ట్రాల వాటా 9%కి పరిమితం కానుంది. వీటిలో ఏటా 0.4% మేర మాత్రమే జనాభా పెరగనుంది. ఇది జాతీయ సగటు కంటే చాలా తక్కువ.
* 2031-35 మధ్యకాలంలో బిహార్‌ మినహా మరే రాష్ట్రంలోనూ క్రూడ్‌ బర్త్‌రేట్‌ 20కి మించదు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పంజాబ్‌లలో ఇది అతి తక్కువకు (9.9) పడిపోనుంది.
* 2036 నాటికి దేశంలో పెరిగే మొత్తం జనాభాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల వాటా 1.5%కి పరిమితం కానుంది.