Editorials

అసమాన ప్రతిభాశాలి…భానుమతి రామకృష్ణ

అసమాన ప్రతిభాశాలి…భానుమతి రామకృష్ణ

సి.పుల్లయ్యగారు ‘వరవిక్రయం’ (1939) సినిమా నిర్మాణాన్ని తలపెట్టిన రోజులవి. అందులో కాళింది అనే పెళ్లి కూతురు పాత్రకి నటిని వెతుకుతున్నారు. ఎవరో చెప్పగా విని, రామబ్రహ్మంగారిని అడిగారు- ‘‘మీ దగ్గరకి ఎవరో అమ్మాయి వేషం కోసం వచ్చిందిటగా? బాగా పాడిందని విన్నాను. ఆ అమ్మాయిని మీరు తీసుకున్నారా?’’ అని అడిగారు.

‘‘అబ్బేబ్బే… పాట బాగానే పాడిందిగాని, ఏమిటో చూడ్డానికి ఏడుపు మొహం. అంత ఆహ్లాదకరంగా కనిపించలేదు’’ అన్నారు రామబ్రహ్మం. భానుమతి జయంతి(సెప్టెంబర్‌ 7, 1925) ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు..

‘‘ఏడుపు మొహమా? నా సినిమాలో ఏడుపు పాత్రే ఉంది. మీరు ఆమె చిరునామా ఇస్తే నేను చూస్తాను’’ అని, ఆ చిరునామా తెలుసుకుని, ఒంగోలు దగ్గర వున్న ఒక వూరు నుంచి పిలిపించుకున్నారు పుల్లయ్య. చూశారు, పాట విన్నారు. అమ్మాయికి ఉత్సాహం వుందని తండ్రి చెప్పారు. పుల్లయ్య కాళింది వేషం ఇచ్చారు. పాట పాడమని అడిగినప్పుడు, భానుమతి అనే ఆ అమ్మాయి ‘‘పలుకవేమి నా దైవమూ’’ అన్న త్యాగరాజకీర్తన పాడింది. బాగా పాడిందని అదే పాటని సినిమాలోని పెళ్లి చూపులు దృశ్యంలో పాడించారు. తండ్రి కట్నం ఇచ్చుకోలేక, పిల్లకి పెళ్లి చెయ్యలేకపోతాడు. ఆ సినిమాలో భానుమతి ‘‘స్వాతంత్య్రమేలేదా స్త్రీ జాతికి’’ అన్నపాట, ‘‘జాతికి ఈ సూత్రంబె’’ అన్న పాట పాడారు. ఈ పాటల రికార్డులు సినిమా విడుదలయాక ఆ రోజుల్లో ఇంటింటా మార్మోగాయి. సినిమా విజయం సాధించింది. సి.పుల్లయ్య తర్వాత తీసిన ‘మాలతి మాధవమ్‌’ (1940)లో నాయిక పాత్ర ధరింపజేశారు భానుమతితో. సినిమా పరాజయం పొందినా, భానుమతి నటన పరాజయం పొందలేదు. ‘ధర్మపత్ని’, ‘భక్తిమాల’ సినిమాలు వచ్చాక, ‘కృష్ణప్రేమ’ (1943) వచ్చింది. ఈ ‘కృష్ణప్రేమ’ రామకృష్ణ ప్రేమగా మారింది. అంటే ఆ సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేసిన రామకృష్ణారావుని భానుమతి ఇష్టపడింది. ఆయన సద్గుణం, ప్రవర్తన, తెలివితేటలు ఆమెను ఆకర్షించాయి. అతని కోసం పరితపించి, ప్రణయగానం చేసి పరిణయం చేసుకున్నది.

శుద్ధంగా తమిళభాష నేర్చుకోడంతో, తమిళ చిత్రాల్లోనూ వేషాలు వచ్చాయి. ప్రతిభగల నటిగా నిలబడిందామె. సినిమాలకి రాకముందు భానుమతి, కాంచనమాల అభిమాని. ఆమెను చూడాలని కుతూహలపడి, ఒక షూటింగ్‌లో చూసి పరిచయం చేసుకుంది. భానుమతిని నటిగా చూసిన తర్వాత, కాంచనమాల ఆమెను కలిసి, ‘‘నటిగా నీ ముందు నేనెంత?’’ అని అభినందించింది. బి.ఎన్‌.రెడ్డి ‘స్వర్గసీమ’ (1946)తో భానుమతి, గొప్పనటిగా ప్రశంసలు పొంది, ‘స్టార్‌’గా మారింది. దక్షిణ రాష్ట్రాల్లో ‘స్వర్గసీమ’ విజయశంఖం మ్రోగించడంతో, భానుమతి కీర్తిపతాకం మీంటికెగసింది! ‘‘భానుమతి నటన కోసమే నేను ‘స్వర్గసీమ’ 30 సార్లుకు పైగా చూశాను’’ అని చెప్పారు శివాజి గణేశన్‌. తర్వాత, ఇద్దరూ కలిసి నటించడం – గొప్ప విశేషం! ‘స్వర్గసీమ’లోని ఆమె పాత్ర అమాయకురాలైన కూచిపూడి నాట్యకత్తె. రానురాను ఆధునికంగా తయారై, హీరోని వలలో వేసుకుని, తర్వాత ఇంకొకరిని వలలో పేసే పాత్ర. ఈ పాత్రలోని దశలు భానుమతి నటనా శక్తికి గీటురాళ్లు. సహజంగా సంభాషణలు చెప్పడంతో, పాడడంలో ఆమెకి ఆమే సాటి అని పించుకుంది. ‘ఓ హోహో పావురమా’ పాట, ఎదురుగా వున్న హీరోనే కాకుండా, ప్రేక్షకుల్ని కూడా రెచ్చగొట్టింది.

రామకృష్ణలాంటి భర్త దొరకడంతో, కొడుకు భరణిపేరుతో రామకృష్ణ దర్శకత్వంలో చిత్రనిర్మాణం ఆరంభించి ‘రత్నమాల’, ‘లైలామజ్ను’, ‘ప్రేమ’, ‘చండీరాణి’, ‘చక్రపాణి’, ‘విప్రనారాయణ’, ‘చింతామణి’, ‘వరుడుకావాలి’, ‘బాటసారి’, ‘వివాహబంధం’, ‘గృహలక్ష్మి’, ‘అంతా మనమంచికే’, ‘విచిత్ర వివాహం’, ‘అమ్మాయిపెళ్లి’, ‘మనవడికోసం’ ‘రచయిత్రి’, ‘ఒకనాటి రాత్రి’ ‘భక్త ధ్రువ-మార్కండేయ’ మొదలైన చిత్రాలు నిర్మించారు. విశేషం ఏమిటంటే, ‘చండీరాణి’ని మూడు భాషల్లో నిర్మించారు. భానుమతే డైరెక్టు చేశారు. అలా తెలుగులో మొదటి దర్శకురాలుగా పేరు తెచ్చుకున్నారు. ‘వరుడు కావాలి’, ‘అమ్మాయిపెళ్లి’, ‘మనవడి కోసం’, ‘రచయిత్రి’, ‘ఒకనాటి రాత్రి’, ‘భక్తధ్రువ-మార్కండేయ’ చిత్రాల్ని భానుమతి డైరక్టు చేశాడు. ఇందులోని విశేషం ఏమిటంటే ‘రచయిత్రి’ ‘ఒకనాటిరాత్రి’ చిత్రాలు సెన్సార్‌ అయినాయి గాని విడుదల కాలేదు. ‘రచయిత్రి’ విడుదల కాకుండానే ఆమె ప్రభుత్వ సబ్సిడీ తీసుకున్నారని, నరసరాజుగారు చెప్పారు. అది, ఆమె మీద వున్న గౌరవం కాబోలు!

అక్కినేని నాగేశ్వరరావుకి, భానుమతి, రామకృష్ణలమీద ఎనలేని గౌరవం, భక్తీ. ‘‘నేనింకా పరిణతి పొందక ముందే నాకు ‘లైలామజ్ను’ సినిమా ఇచ్చారు. ‘విప్రనారాయణ’, ‘బాటసారి’ వంటి గొప్పపాత్రలు ఇచ్చారు’’ అని చెప్పేవారు.

భానుమతి మధురమైన గాయని. ఆమె కంఠం సుడులు, చక్రాలూ తిరిగినట్టు పలుకుతుంది. సంగీత కచేరీలలో పాడేవాళ్లు తక్కిన వాళ్లు పాటలు పాడతారు గానీ, భానుమతి పాటలు పాడడం తక్కువ. ఆమెని అనుసరిస్తూ పాడడం తేలికైన విషయం కాదు. భానుమతి వేరెవరికీ ప్లేబాక్‌ పాడలేదు. తనకెవరూ పాడలేదు. అయితే ‘చండీరాణి’ హిందీలో మాత్రం సంధ్యకి భానుమతి గాత్రం వినిపిస్తుంది.
‘‘దర్శకత్వం వహించడానికి కల్పనాశక్తి కావాలి. నేను రచయిత్రిని గనక, దర్శకత్వం చేపట్టడానికి అవకాశాలు ఎక్కువ. అయితే నా చిత్రాలకు నేనే మాటలు రాసుకోలేదు. కానీ, రాసిన వాటిని చూసి, నాకు కావలసినట్టుగా దిద్దుకుంటాను’’ అని చెప్పారు భానుమతి ఒక సందర్భంలో. ఆమెలో మంచిహాస్యం, వ్యంగ్యం, చమత్కారం వున్నాయి. అవన్నీ కలగలిపి ఆమె ‘అత్తగారి కథలు’ రాశారు. బహుళ ప్రసిద్ధి పొందాయి. ఆ రచనకు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ‘అత్తగారి కథలు’ టీవీ సీరియల్‌గా తియాలని ప్రారంభించారు. ఆమే నిర్మాత, దర్శకురాలు. కొన్ని భాగాలు తీశారుగానీ, ముందంజ వెయ్యలేదు. కొన్ని చిత్రాలకు ఆమె సంగీతం చేశారు. ‘విప్రనారాయణ’కు సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకుడయినా, భానుమతి- ‘సంగీత పర్యవేక్షణ’ అంటూ తనపేరు వేసుకున్నారు. తాను పాటలకి స్వర కల్పన చేసినా, రికార్డింగ్‌ మాత్రం సత్యం చేతా, వేణు చేతా చేయించారు. ఆమె నటనా ప్రతిభకు గుర్తింపుగా పద్మశ్రీ (1966) పద్మభూషణ్‌ (2000) ప్రశంసలు అందజేసింది కేంద్రం. 1975లో ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్‌తో గౌరవించింది.

అయితే ఆమెకు ‘అహంకారం’ వుందని అంటారు. ఆ మాటే నేను అడిగితే ‘‘అవును. నాకు కాక ఇంకెవరికి అహంకారం?’’ అని అడిగారు ఆమె. షూటింగ్స్‌కి వెళ్లడంలో ‘తన మన’ భేదం లేదు. ఇతరుల చిత్రాలకి ఆలస్యంగా వెళ్లినట్టు తన సినిమాలకీ అలాగే వచ్చేవారు. ఇబ్బందులు పెట్టే నటిగా ఆమెకు పేరుంది.‘‘స్వర్గసీమలోనే నేను ఆమెతో ఇబ్బందులు పడ్డాను. ‘మల్లీశ్వరి’లో మరీ పడ్డాను. ప్రతిభావంతురాలైన నటి, అంచేత భరించాను’’ అని బి.ఎన్‌.రెడ్డి చెప్పేవారు. ఆమె ఆలస్యాలు భరించలేకనే విజయవారు ‘మిస్సమ్మ’లో ఆమెను తొలగించవలసి వచ్చింది.

‘విజయచిత్ర’ పత్రికలో నేను ఉన్నప్పుడు ఆమెను చాలాసార్లు కలిసి, జీవితకథను చెప్పమని అడిగితే, కొన్నాళ్లు చెప్పారు. తర్వాత ఏవో వివాదాలు లేవడంతో, ఆపేయవలసి వచ్చింది. ఆ కథపేరు ‘నాలో నేను’. తర్వాత ఆమె పూర్తి చేసుకున్నారు. ఆ రచనకు కేంద్రం ‘స్వర్ణకమలం’ పురస్కారం ఇచ్చింది. మ్యూజింగ్స్‌ పేరుతో, ‘నాలో నేను’ ఆంగ్లంలోకి అనువదితమైంది. భానుమతి గొప్పగాయని, గొప్పనటి. ఏ చిత్రం చూసినా ఆమె ముద్ర ప్రస్ఫుటంగా కన్పిస్తుంది.
-రావి కొండలరావు