DailyDose

రియా ఎదురు ఫిర్యాదు-తాజావార్తలు

రియా ఎదురు ఫిర్యాదు-తాజావార్తలు

* తెలంగాణ శాసనసభ బీఏసీ సమావేశం ముగిసింది. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ బేటీలో వర్షాకాల సమావేశాల నిర్వహణపై చర్చించారు. సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశంతో పాటు ఏయే అంశాలపై సభ నడపాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 28 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఈనెల 12, 13, 20, 27 తేదీల్లో శాసనసభకు సెలవులు ఇవ్వనున్నారు. మొత్తం 18రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.

* జూన్‌ త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 23.9శాతం మేర కుచించుకుపోవడంపై ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఆత్మసంతృప్తి నుంచి బయటకు వచ్చి అర్థవంతమైన చర్యలకు శ్రీకారం చుట్టాలని హితవుపలికారు. ప్రతిఒక్కరూ అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని బట్టి చూస్తే ప్రభుత్వం మరింత క్రియాశీలకంగా, వివేకంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

* తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఇవాళ్టి నుంచి ఈ-స్టాంపుల విక్రయాన్ని అధికారులు నిలిపివేశారు. ఇప్పటికే చలానాలు చెల్లించిన వారికి ఇవాళ ఒక్కరోజు రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు అవకాశమిచ్చారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్‌శాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది.

* రక్షణ పరిశోధన విభాగం డీఆర్‌డీవో నేడు హైపర్‌సానిక్‌ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించినట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రకటించారు. ఈ సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో దేశం సాంకేతిక రంగంలో కీలక ముందడుగు వేసినట్లైందని తెలిపారు. ఇందుకు కృషిచేసిన శాస్త్రవేత్తలకు రాజ్‌నాథ్‌ అభినందనలు తెలిపారు. ప్రధాని కల అయిన ఆత్మనిర్భర్‌ భారత్‌ వాస్తవ రూపం ధరించడానికి ఇది కీలక పరిణామమని వెల్లడించారు.

* పౌష్టికాహారం లేకపోతే పిల్లల్లో ఎదుగుదల ఉండదని, అందుకే చిన్నతనం నుంచే మంచి ఆహారం ఇవ్వాలనే ఆలోచనతో ముందడుగు వేస్తుస్తున్నామని సీఎం జగన్‌ చెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ పోషణ, వైఎస్‌ఆర్‌ పోషణ ప్లస్‌ పథకాలను ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వాలకంటే మరింత మెరుగ్గా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తామన్నారు.

* ‘మరో 14 రోజుల్లో..’ అంటూ కోహ్లీ, దినేశ్‌ కార్తీక్‌ చిత్రాన్ని ఐపీఎల్‌ ట్విటర్లో ఉంచినప్పుడు అందరికీ ఒకే అనుమానం కలిగింది. ఆరంభ మ్యాచులో కోల్‌కతా, బెంగళూరు తలపడతాయని అనుకున్నారు. ఎంఎస్‌ ధోనీ తీసుకున్న అనూహ్య నిర్ణయం వల్లే మొదటి మ్యాచులో చెన్నై ఆడుతోందట. వాస్తవంగా సెప్టెంబర్‌ 19 లేదా 23న తొలి మ్యాచ్‌ ఆడేందుకు ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ సీఎస్‌కే అవకాశం కల్పించారని తెలిసింది.

* సుదీర్ఘ కాలం తర్వాత దేశ రాజధాని దిల్లీలో మెట్రో రైలు సేవలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల నేపథ్యంలో దశల వారీగా ఈ మెట్రో రైలు సేవలు ప్రారంభించినట్లు దిల్లీ మెట్రో రైలు అధికారులు తెలిపారు. ప్రయాణికులెవరూ కొవిడ్‌ బారిన పడకుండా ఉండేందుకు మెట్రో అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

* భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతోన్న నేపథ్యంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను భారీగా చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా నిత్యం దాదాపు 10లక్షల నమూనాలను పరీక్షిస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది. కేవలం వారాంతంలో మాత్రమే పరీక్షల సంఖ్య కాస్త తగ్గుతోంది. నిన్న మరో 7లక్షల 20వేల (7,20,362) పరీక్షలు నిర్వహించారు. దీంతో సోమవారం నాటికి 4కోట్ల 95లక్షల శాంపిళ్లకు పరీక్షలు పూర్తిచేసినట్లు ఐపీఎంఆర్‌ పేర్కొంది.

* సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఆదేశం మేరకు విచారణకు వెళ్లిన బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తితో మీడియా ప్రవర్తించిన తీరును నటి మంచు లక్ష్మి ఖండించారు. రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తిని అరెస్టు చేసిన అధికారులు ఆదివారం ఉదయం నటికి సమన్లు జారీ చేశారు. మధ్యాహ్నం ఆమె విచారణ నిమిత్తం ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు ఆమెతో మాట్లాడేందుకు, ఫొటోలు తీసేందుకు గుమిగూడారు.

* భూమిపై ఉన్న జీవ రాశుల్లో 15-20శాతం చీమలే ఉంటాయని అంచనా. ఇవి కూడా మనుషుల్లాగే సాంఘిక జీవితం సాగిస్తుంటాయి. కలిసిమెలిసి ఉంటూ వాటికంటూ ఓ గూడు ఏర్పాటు చేసుకుంటాయి. అతి తక్కువ స్థలంలో పెద్ద సంఖ్యలో గుమిగూడుతుంటాయి. అయితే అంటువ్యాధులు వచ్చినప్పుడు ముందస్తు జాగ్రత్తగా కఠినమైన చర్యలు తీసుకుంటాయి. ఆ సమయంలో చీమల సమూహం వ్యవహరించే తీరులో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

* బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో నటి రియా చక్రవర్తి విచారణను ఎదుర్కొంటోంది. తాజాగా ఆమె సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి సోదరి యాంగ్జైటీకి సంబంధించిన మందులంటూ నకిలీ మెడికల్‌ ప్రిస్క్రిప్షన్‌ను ఇచ్చిందంటూ ఆరోపించింది.