* కొవిడ్ వ్యాక్సిన్ రేసులో ముందంజలో ఉన్న ఆక్స్ఫర్డ్ టీకా ప్రయోగాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. బ్రిటన్లో ఈ టీకా వేయించుకున్న ఓ వాలంటీరుకు అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు సమాచారం. దీంతో తుది దశకు చేరుకున్న క్లినికల్ ట్రయల్స్ను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. ప్రయోగ ప్రామాణిక ప్రక్రియ ప్రకారం వ్యాక్సిన్ భద్రతపై మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆస్ట్రాజెనెకా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఆ వాలంటీర్కు తలెత్తిన అనారోగ్య సమస్యలేంటో మాత్రం వెల్లడించలేదు.
* ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 71,692 నమూనాలను పరీక్షించగా 10,418 మంది కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో కొవిడ్ సోకిన వారి సంఖ్య 5,27,512కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
* అస్సాంలోని సిల్చార్ నగరానికి చెందిన వ్యాపారవేత్త నారాయణ్ మిత్ర గత కొంతకాలం నుంచి అస్తమాతో బాధ పడుతున్నారు. ఆయనకు జూలై 13వ తేదీ రాత్రి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. ఆయన ఈ విషయాన్ని తన కుమారుడు అభిజిత్ మిత్రాకు తెలిపారు. కుమారుడు ఇచ్చిన ఇన్హేలర్తో కాస్త ఊరట కలిగింది. ఆ మరుసటి రోజు అభిజిత్ మిత్రా, కుటుంబ వైద్యుడికి ఫోన్చేసి తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. ఆయన్ని ఆస్పత్రికి తరలించి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించాల్సిందిగా ఆ కుటుంబ వైద్యుడు సలహా ఇచ్చారు.
* కరోనా నివారణకు సంబంధించి దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ రెమ్డెసివిర్ కొత్త ఔషధాన్ని లాంచ్ చేసింది. కోవిడ్ -19 రోగుల చికిత్సకు గాను భారతదేశంలో ‘రెడిక్స్’ బ్రాండ్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 100 మి.గ్రా పరిమాణంలో రెడిక్స్ మందును లాంచ్ చేసినట్టు పేర్కొంది.