Business

ఫోర్బ్స్ అమెరికా శ్రీమంతుల జాబితాలో ఏడుగురు భారతీయులు

ఫోర్బ్స్ అమెరికా శ్రీమంతుల జాబితాలో ఏడుగురు భారతీయులు

ఫోర్బ్స్‌ అమెరికా శ్రీమంతుల జాబితాలో భారత సంతతికి చెందిన ఏడుగురికి చోటు దక్కింది. 2020 సంవత్సరానికి గాను అమెరికాలోని అత్యంత ధనవంతులైన 400 మందితో ఫోర్బ్స్‌ ఈ జాబితా రూపొందించింది. ఇందులో అమెరికాలో నివసిస్తున్న ఏడుగురు భారత సంతతి వ్యక్తుల పేర్లు ఉన్నాయి. సైబర్‌ సెక్యూరిటీ సంస్థ జెడ్‌స్కేలర్‌ సీఈఓ జై చౌదరీ, సింపనీ టెక్నాలజీ గ్రూపు ఛైర్మన్‌ రమేశ్‌ వాద్వాని, వేఫెయిర్‌ సహవ్యవస్థాఫకుడు, సీఈఓ నీరజ్‌ శా, కోశ్లా వెంచర్స్‌ వ్యవస్థాపకుడు వినోద్‌ కోశ్లా, షేర్‌పాలో వెంచర్స్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ కవిటర్క్‌ రామ్‌ శ్రీరామ్‌, రాకేశ్‌ గాంగ్వాల్‌, వర్క్‌డే సీఈఓ అనిల్‌ భూశ్రీ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అమెరికాలో అత్యంత శ్రీమంతుడిగా అమెజాన్‌ అధిపతి జఫె్‌ బెజోస్‌ వరుసగా మూడో సంవత్సరం అగ్రస్థానాన్ని సంపాదించారు. ఈయన నికర సంపద 179 బిలియన్‌ డాలర్లు. బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ 111 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో రెండో స్థానంలో నిలిచారు. ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ (85 బిలియన్‌ డాలర్లు) మూడో స్థానంలోను, బెర్క్‌షైర్‌ హాథ్‌వే సీఈఓ వారెన్‌ బఫెట్‌ (73.5 బిలియన్‌ డాలర్లు) నాలుగో స్థానంలో నిలిచారు. ఒరాకిల్‌ సహవ్యవస్థాపకుడు లారీ ఎలిసన్‌ 72 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో ఐదో ర్యాంకు పొందారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 339వ స్థానంలో నిలిచారు. ఈయన నికర సంపద 2.5 బిలియన్‌ డాలర్లు. భారత సంతతికి చెందిన జై చౌదరీ 85వ స్థానం (6.9 బిలియన్‌ డాలర్లు), రమేశ్‌ వాద్వాని 238వ స్థానం (3.4 బి.డాలర్లు), నీరజ్‌ శా 299వ స్థానం (2.8 బి.డాలర్లు), వినోద్‌ కోశ్లా 353వ స్థానం (2.4 బి.డాలర్లు), కవిటర్క్‌ రామ్‌ శ్రీరామ్‌, రాకేశ్‌ గాంగ్వాల్‌, అనిల్‌ భూశ్రీ 359వ స్థానం (2.3 బి.డాలర్లు) పొందారు.