DailyDose

24గంటల్లో ఇండియాలో 95735 కేసులు-TNI బులెటిన్

24గంటల్లో ఇండియాలో 95735 కేసులు-TNI బులెటిన్

* దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 95,735 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,65,864కి చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ ఈ విధంగా ఉంది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 1,172 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 75,062కు చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 9,19,018 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.కరోనా నుంచి ఇప్పటివరకు 34,71,784 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా రోగుల రికవరీ రేటు 78.77 శాతంగా ఉండగా.. యాక్టివ్ కేసులు 20.67 శాతంగా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,29,756 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిపగా.. ఇప్పటివరకు మొత్తం 5,29,34,433 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

* కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో రోజుకు పదివేలమందికి మాత్రమే అమ్మవారి దర్శనాలు పరిమితంకానున్నాయి. అది కూడా ముందుగా ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్నవారిని మాత్రమే దర్శనానికి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. వచ్చేనెల 17 నుంచి 25 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరగనున్నాయి.

* కరోనా నేపథ్యంలో దెబ్బతిన్న వీధి వ్యాపారులు తమ వ్యాపారాలను పునః ప్రారంభించి, ఆత్మస్థైర్యం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వనిధి)’ పథకాన్ని ప్రారంభించిందని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.కరోనా మహమ్మారి కారణంగా మనమంతా ఆర్ధికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, వీధి వ్యాపారులైతే కోవిడ్-19 కారణంగా మరింత ఇబ్బందులకు గురయ్యారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఒక్కరోజు వ్యవధిలో 72,229 నమూనాలను పరీక్షించగా 10,175 మందికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 5,37,687కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ 68 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 9 మంది, కడపలో 9, నెల్లూరు 9, కృష్ణా 7, ప్రకాశం 7, అనంతపురం 6, తూర్పుగోదావరి 5, పశ్చిమగోదావరి 5, శ్రీకాకుళం 4, విశాఖపట్నం 4, గుంటూరు 2, విజయనగరంలో ఒకరు మరణించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 4,702కి చేరింది. ఒక్కరోజులో 10,040 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 43,80,991 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం 97,338 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

* ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనికా తయారు చేసిన వ్యాక్సిన్‌ మూడోదశ ప్రయోగాలకు భారత్‌లోనూ బ్రేక్‌ పడింది. ఆస్ట్రాజెనికా తిరిగి ప్రయోగాలను ప్రారంభించేంత వరకూ భారత్‌లోనూ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సీరం ఇనిస్టిట్యూట్‌ ప్రకటించింది. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపింది. డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) సూచనలను అనుసరిస్తున్నామని.. వీటికి సంబంధించి మరింత వ్యాఖ్యానించలేమని పేర్కొంది. అదనపు సమాచారం కోసం డీసీజీఐను సంప్రదించవచ్చని సీరం ఇనిస్టిట్యూట్‌ సూచించింది.

* క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఒక వాలంటీరుకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాలు తాత్కాలికంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై యూఎస్‌ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ స్పందించారు. ఇలా ట్రయల్స్‌ నిలిపివేడయం దురదృష్టకరమైన పరిణామమే అయినా, అసాధారణ విషయమేమీ కాదన్నారు. పని దగ్గర ఇదొక సేఫ్టీ వాల్వ్‌ లాంటిదని చెప్పారు.