Editorials

భారత రాష్ట్రపతి ప్రధానిలపై చైనా నిఘా

భారత రాష్ట్రపతి ప్రధానిలపై చైనా నిఘా

భారత్‌లోని ప్రముఖులపై చైనా నిఘా వేసిందంటూ ప్రముఖ జాతీయ పత్రిక ప్రచురించిన ఓ కథనం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా నేడు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడంతో దీన్ని ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అఠవాలే స్పందించారు. భారత్‌ కూడా చైనాపై ఓ కన్నేసి ఉంచిందని.. త్వరలోనే ఆ దేశానికి ఓ గుణపాఠం నేర్పుతామని వ్యాఖ్యానించారు.

భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, మంత్రులు సహా అనేక మంది రాజకీయ నేతలపై చైనా గూఢచార సంస్థలు నిఘా వేశాయంటూ జాతీయ ఆంగ్ల పత్రిక ‘‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’’ ఓ పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. కథనం ప్రకారం.. దేశంలో దాదాపు 10 వేల మందిపై చైనా రహస్యంగా నిఘా వేసింది. వీరిలో రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, వివిధ కమిటీల్లోని సభ్యులు, మాజీ సైనికాధికారులు, శాస్త్రవేత్తలు, రక్షణ రంగ నిపుణులు, అంతరిక్ష పరిశోధకుల దగ్గర నుంచి మేయర్లు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, సర్పంచ్‌ల వరకు ఉన్నారు. అధికార, విపక్షాలతో పాటు ప్రాంతీయ పార్టీల నాయకులు వారి కుటుంబ సభ్యులు, సమీప బంధువులపై సైతం నిఘా ఉంచింది. షెన్‌జెన్, ఝెన్హువా అనే ఐటీ సంస్థలు ‘ఓవర్సీస్‌ కీ ఇన్‌ఫర్మేషన్‌ డేటాబేస్‌’ పేరిట ‘హైబ్రిడ్‌ వార్‌ఫేర్‌’ అనే కార్యాన్ని వెలగబెడుతున్నాయి. ప్రముఖుల సమాచారాన్ని సేకరించడంతో పాటు వారి ఆన్‌లైన్‌ కార్యకలాపాల్ని ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తున్నాయి.

భారత్‌తో పాటు ఇతర దేశాల ప్రముఖులపైనా చైనా నిఘా వేసినట్లు తెలుస్తోంది. బ్రిటన్‌లో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, సహా వేలాది మంది ప్రముఖులపై చైనాకు చెందిన ఓ సంస్థ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ప్రముఖ పత్రిక ‘ది టెలిగ్రాఫ్‌’ పేర్కొంది. ప్రముఖ నేతల కుటుంబాలకు చెందిన సమాచారాన్ని సైతం ఇవి కూడగడుతున్నట్లు గుర్తించింది. ఆస్ట్రేలియాలోనూ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ సహా 35వేల మంది ప్రముఖులపై చైనా నిఘా వేసినట్లు ప్రముఖ పత్రిక ‘ఫైనాన్షియల్‌ రివ్యూ’ పేర్కొంది. ఇలా అమెరికాలో 51వేలు, ఆస్ట్రేలియాలో 35 వేలు, భారత్‌, బ్రిటన్‌లో చెరో 10 వేలు, కెనడాలో 5వేల మంది ప్రముఖులపై నిఘా వేసినట్లు తెలిపింది. ఇప్పటి వరకు దాదాపు 24 లక్షల మంది సమాచారాన్ని సేకరించినట్లు వెల్లడించింది.

ఝెన్హువా కంపెనీ ట్యాగ్‌ లైన్‌ని పరిశీలిస్తేనే అసలు విషయం బయటపడుతోంది. ‘ఎనీథింగ్‌ కెన్‌ బీ టర్న్‌డ్‌ ఇన్‌టూ రియాలిటీ త్రూ సోషల్‌ మీడియా’ అంటే ‘సామాజిక మాధ్యమాల ద్వారా దేన్నైనా వాస్తవంగా మార్చొచ్చు’ అన్న ట్యాగ్‌ లైన్‌తో ఈ సంస్థ పనిచేస్తున్నట్లు ఫినాన్షియల్‌ రివ్యూ పేర్కొంది. సమాచారాన్ని సేకరించి దాని ఆధారంతో సోషల్‌ మీడియాలో నకిలీ వార్తల్ని ఉంచడమే దీని ప్రధాన ఉద్దేశమని స్పష్టంగా అర్థమవుతోంది. తద్వారా ఆయా దేశాల అంతర్గత విషయాల్లో తలదూర్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రకంగా కొత్త రకం సాంకేతిక యుద్ధానికి చైనా కుట్ర పన్నుతోంది. ఈ సైట్లపై పనితీరును పరిశీలించిన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓ సుదీర్ఘ ప్రశ్నావళిని సంధించింది. దీంతో అడ్డంగా దొరికిపోయామని పసిగట్టిన ఆ సంస్థ తమ వెబ్‌సైట్‌ను సెప్టెంబరు 9 నుంచి అందుబాటులో లేకుండా చేసింది. ఈ చర్యతో వారు అక్రమంగా సమాచారం సేకరిస్తున్నామని అంగీకరించినట్లైంది.

చైనా చేస్తున్న దురాగతాలు ప్రభుత్వానికి ముందే తెలుసని సమాచారం. ఈ మేరకు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిన కథనంపై కొంతమంది ఉన్నతాధికాకారుల స్పందనను ఓ ప్రముఖ జాతీయ వార్తా సంస్థ సేకరించింది. చైనా అక్రమంగా చేస్తున్న డేటా మైనింగ్‌ గురించి తమకు ముందే తెలుసని అధికారులు తెలిపారు. ఓపెన్‌ సోర్స్‌లో ఉన్న నేతల సమాచారాన్ని వారు సేకరిస్తున్నట్లు గుర్తించామన్నారు. దీన్ని దుర్వినియోగం చేసే అవకాశమూ ఉందన్నారు. భారత్‌పై విషం చిమ్మడానికి ఈ సమాచారాన్ని ఉపయోగించుకునే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల చైనా యాప్‌లపై నిషేధం విధించినట్లు వెల్లడించారు.

గత కొన్ని నెలలుగా సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు పాల్పడుతోంది. భారత భూభాగంలోని వ్యూహాత్మక ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు యత్నించింది. కానీ, డ్రాగన్‌ దుర్బుద్ధిని ముందే పసిగట్టిన భారత్‌ వారి కుయుక్తుల్ని సమర్థంగా తిప్పికొట్టింది. పైగా వారి కంటే ముందే కీలక ప్రాంతాలపై పట్టు సాధించి చైనాకు గట్టి బదులిచ్చింది. దీంతో సరిహద్దుల్లో మన సైనికులను ఎదుర్కోలేక పోతున్న చైనా.. ఇలాంటి దొంగదారుల్ని ఎంచుకున్నట్లు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయడుతున్నారు. వారి కుట్రలన్నీ విచ్ఛిన్నం కావడంతో సాంకేతిక యుద్ధానికి తెరతీసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అమెరికాలో ప్రముఖ పత్రిక ‘న్యూస్‌వీక్‌’ సైతం చైనా కుయుక్తుల్ని బహిర్గతం చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా దుందుడుకుగా ముందుకు వెళ్లిన చైనా వైఫల్యం మూటగట్టుకుందని కుండబద్దలు కొట్టింది. దీంతో అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భంగపాటుకు గురయ్యారని విశ్లేషించింది. ఏదేమైనా చైనా తాజా చర్యలు తీవ్ర ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. నేతల ఓపెన్‌ సోర్స్‌ డేటా సైతం ప్రత్యర్థులకు కావాల్సిన కీలక సమాచారాన్ని అందించే అవకాశం ఉందన్నారు. ఇది దేశ భద్రతకు ఏమాత్రం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

అలాగే దురాక్రమణపూరిత వైఖరితో ముందుకు సాగుతున్న చైనా.. ఆయా దేశాల రక్షణ, సైనిక వ్యవస్థల సమాచారాన్ని సేకరించేందుకు వెంపర్లాడుతోంది. ఈ కీలక సమాచారాన్ని ముందే పసిగట్టి వ్యూహాత్మకంగా పై చేయి సాధించొచ్చని భావిస్తోంది. ఆధునిక ప్రపంచంలో అంతరిక్ష రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. భవిష్యత్తులో అంతరిక్షమే యుద్ధ క్షేత్రంగా నిలవనుందన్న అభిప్రాయమూ వెలువడుతోంది. ఇప్పటికే ఉపగ్రహ విధ్వంసక క్షిపణులు, హైపర్‌సోనిక్‌ సాంకేతికతలో పలు దేశాలు బాహాబాహీ తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతరిక్షంపై పట్టు సాధించాలని చైనా ఉవ్విళ్లూరుతోంది.