Movies

విమానం ఎక్కి ఏడుపులు

విమానం ఎక్కి ఏడుపులు

పైలట్‌ అవ్వాలన్నది శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌ కల. అది సినిమాల ద్వారా తీరడం ఆమెకు మరింత ఆనందాన్ని పంచుతుందట. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం ‘గుంజన్‌ సక్సేనా:ది కార్గిల్‌ గర్ల్‌’. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో యుద్ధవిమానం నడిపిన తొలి పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవిత కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో తన పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమైంది జాన్వి. ‘‘నిజ జీవితంలో అసలు చేయలేనేమో అనుకున్నవి ఇప్పుడు చేశాను. యుద్ధ హెలికాప్టర్‌ నడిపాను. నాతో పాటు ఓ పైలట్‌ ఉండేవారు. గంటల కొద్దీ అందులోనే గడిపాను. కొద్ది గంటల తర్వాత ‘‘నడపడం మీకు బాగా వచ్చినట్టుంది. నేను ఇలాగే కూర్చుంటాను. ఇకపై కంట్రోల్స్‌ బాధ్యత మీదే’’ అన్నారు నా పక్కనున్న పైలట్‌. అంత ఇష్టంతో అన్నీ నేర్చుకున్నాను. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ముందు నుంచీ నాకు పైలట్‌ కావడం అంటే చాలా ఇష్టం అని సెట్‌లో అందరితోనూ చెప్పేదాన్ని. షూటింగ్‌ మొదలయ్యాకా తొలిసారి పైలట్‌గా హెలికాప్టర్‌ ఎక్కగానే ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి. నాకే కాదు సెట్లో ఉన్న చాలామంది నన్ను చూసి భావోద్వేగానికి గురయ్యారు’’అని షూటింగ్‌ అనుభవాల్ని పంచుకుంది జాన్వి.