Movies

సమన్లు అందుకున్న రకుల్‌ప్రీత్

సమన్లు అందుకున్న రకుల్‌ప్రీత్

మాదకద్రవ్యాల వ్యవహారం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో డ్రగ్స్‌ కోణం బయటపడటంతో రంగంలోకి దిగిన మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్సీబీ) అధికారుల దర్యాప్తులో కొత్త పేర్లు బయటకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరికొందరు బాలీవుడ్‌ తారలకు ఎన్‌న్సీబీ సమన్లు జారీ చేసింది. బాలీవుడ్‌ తారలు దీపికా పదుకొణె, సారా అలీఖాన్‌, శ్రద్ధా కపూర్‌, రకుల్‌ప్రీత్ సింగ్‌కు సమన్లు జారీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. మూడు రోజుల్లో డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ ఆదేశించింది. వీరితో పాటు దీపికా మేనేజర్‌ కరిష్మ, సుశాంత్‌ మేనేజర్‌ శృతి మోదీని కూడా విచారణకు పిలిచారు. సెప్టెంబర్‌ 25న దీపికా పదుకొణె, 26న సారా అలీఖాన్‌, శ్రద్ధా కపూర్‌ హాజరు కావాలని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు, దీపిక తన తదుపరి చిత్రం షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం గోవాలో ఉన్నట్టు సమాచారం. మాదక ద్రవ్యాల వినియోగం కేసులో దీపికా పదుకొణే మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌తో పాటు టాలెంట్‌ మేనేజర్‌ జయా సాహాను కూడా ఎన్సీబీ అధికారులు విచారించారు. వీరిద్దరి మధ్య డ్రగ్స్‌ గురించి జరిగిన చాటింగ్‌ వివరాలను అధికారులు సేకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో సుశాంత్‌ సన్నిహితురాలు రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు కొన్ని రోజుల పాటు విచారించి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.