WorldWonders

పర్యాటకులకు చెత్త బహుమతులు ఇస్తున్న థాయిల్యాండ్

పర్యాటకులకు చెత్త బహుమతులు ఇస్తున్న థాయిల్యాండ్

ఎక్కడైనా పర్యటనలకు వెళ్లి వస్తే మనతోపాటు అక్కడ గడిపిన జ్ఞాపకాలు, మధుర స్మృతులు వెంట వస్తాయి. కానీ, ఇకపై థాయ్‌లాండ్‌లోని ఓ జాతీయ పార్కును సందర్శిస్తే మాత్రం మీరు అక్కడ పడేసిన చెత్త మీ వెంట వస్తుంది. విచిత్రంగా ఉంది కదా..! నిజమేనండీ.. ఆ పార్క్‌లో ఎక్కడపడితే అక్కడ చెత్త పడేసే పర్యాటకులకు బుద్ధి చెప్పాలని, పర్యావరణాన్ని కాపాడాలని థాయ్‌లాండ్‌ ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. థాయ్‌లాండ్‌లోని కవో యాయ్‌ జాతీయ పార్కు, ఆ దేశంలో చూడాల్సిన సందర్శక ప్రాంతాల్లో ఇదీ ఒకటి. ఇక్కడికి ఏటా లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ పార్క్‌లో వాటర్‌ఫాల్స్‌, ట్రెక్కింగ్‌ వంటివి ఆకట్టుకుంటాయి. పర్యాటకులు ఇక్కడ సమయం గడపడం కోసం టెంట్లు అందుబాటులో ఉంటాయి. అయితే కొందరు పర్యాటకులు ఈ టెంట్లలో గడిపి.. తిను బండారాల ప్యాకెట్లు, నీరు.. కూల్‌డ్రింక్స్‌ బాటిళ్లు తదితర చెత్తను తీసేయకుండా అక్కడే పడేసి వెళ్తున్నారట. పరిశుభ్రతపై కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించే పర్యాటకులకు బుద్ధి చెప్పాలని అక్కడి ప్రభుత్వం, పార్క్‌ యాజమాన్యం భావించింది. దీంతో ఇకపై పర్యాటకులు చెత్తను నిర్దేశించిన ప్రాంతంలో పడేయకుండా టెంట్లు, పార్కులో పడేస్తే.. టెంట్లు బుక్‌ చేసుకునే సమయంలో ఇచ్చిన చిరునామా ఆధారంగా వారు వదిలేసిన చెత్తను పార్శిల్ చేసి వారికే పంపిస్తారట. ఈ మేరకు ఆ దేశ పర్యావరణశాఖ మంత్రి వరావుత్‌ సిల్పా ఇటీవల సోషల్‌మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ఆ పనులు ప్రారంభమయ్యాయని కొందరు పర్యటకులకు వారు వేసిన చెత్తను పార్శిల్‌ చేసి పంపిస్తున్నట్లు వెల్లడించారు.