Agriculture

వ్యవసాయ బిల్లుకు రామ్‌నాథ్ ఆమోదం

వ్యవసాయ బిల్లుకు రామ్‌నాథ్ ఆమోదం

విపక్షాల వ్యతిరేకత మధ్య పార్లమెంట్‌ ఇటీవల ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్‌ 20న పార్లమెంట్‌ ఈ బిల్లులను ఆమోదించింది. వ్యవసాయ బిల్లులను ఆమోదించరాదని, వాటిని తిప్పిపంపాలని గతవారం విపక్షాలకు చెందిన ప్రతినిధులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి అభ్యర్ధించారు. రాజ్యసభలో రాజ్యాంగవిరుద్ధంగా ప్రభుత్వం ఈ బిల్లులను ఆమోదింపచేసుకుందని విపక్షాలు ఆరోపించాయి.మరోవైపు ఈ బిల్లులు రైతు ప్రయోజనాలకు విఘాతమని రైతు సంఘాలు కొద్దిరోజులుగా ఆందోళన బాటపట్టాయి. ఇక వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పలు రైతు సంఘాలు ఈనెల 25న భారత్‌ బంద్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. హరియాణ, పంజాబ్‌, మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలకు దిగారు. ఈ బిల్లులతో రైతులను కార్పొరేట్‌ వ్యాపారులు శాసిస్తారని, మద్దతు ధర వ్యవస్థ కనుమరుగవుతుందని విపక్ష నేతలు, రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే రైతుల ప్రయోజనాలకు ఇవి ఉపకరిస్తాయని, దళారీ వ్యవస్థ దూరమై రైతులకు మేలు చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది.