DailyDose

థియేటర్లు తెరుచుకోవచ్చు-తాజావార్తలు

* దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యల్లో భాగంగా కేంద్ర హోంశాఖ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. మరిన్ని మినహాయింపులతో బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లు/ మల్టీప్లెక్సులు తెరిచేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, 50 శాతం సీట్ల సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతిచ్చింది. అక్టోబర్‌ 15 నుంచి స్కూళ్లు తెరుచుకోవచ్చని, ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలకు విడిచిపెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

* భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ ఈ వైరస్‌ బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత కొంతకాలంగా 90 వేలు.. 80వేలకు పైగా నమోదైన రోజువారీ కేసులు.. సోమవారం 70 వేలకు (నెల రోజుల్లో తొలిసారి) పడిపోయినా.. మళ్లీ మంగళవారం 80వేలు దాటేశాయ్‌. ఈ పరిస్థితుల్లో భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతున్నా రికవరీ అవుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

* దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ పన్నెండో లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్, కోల్‌కతా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. కోల్ కతా బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతున్నారు. లైవ్ బ్లాగ్ కోసం క్లిక్ చేయండి

* ఏపీలో కరోనా కేసుల తీవ్రత కాస్త తగ్గుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 71,806 నమూనాలను పరీక్షించగా 6,133 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,93,484కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 48 మంది కరోనాతో మృతిచెందారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

* ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ మరోసారి నిర్మాణ బాధ్యతలు అందుకోనున్నాడు. గతేడాది డాక్యుమెంటరీతో వినోద పరిశ్రమలో అడుగుపెట్టిన అతడు ఈ సారి వెబ్‌సిరీస్‌ను నిర్మించనున్నాడు. ఈ విషయాన్ని ‘ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌’ ప్రొడక్షన్‌ హౌస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న అతడి సతీమణి సాక్షి బుధవారం వెల్లడించారు. ఈ వెబ్‌సిరీస్‌ థ్రిల్లింగ్ అడ్వెంచర్‌గా ఉంటుందని ఆమె తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

* గడిచిన ఆరునెలల కాలంలో దాదాపు 33లక్షల మందికిపైగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు రూ.1.18 లక్షల కోట్లను టాక్స్‌ రీఫండ్‌ చేసినట్లు ఆదాయపు పన్నుశాఖ వెల్లడించింది. వీటిలో 31లక్షల మందికి రూ.32,230 కోట్లను చెల్లించగా, 1.78లక్షల కార్పొరేట్‌ పన్నుదారులకు రూ.86,094 కోట్లను తిరిగి చెల్లించినట్లు ఐటీశాఖ పేర్కొంది. ఏప్రిల్‌ 1, 2020 నుంచి 29 సెప్టెంబర్‌ 2020 మధ్య కాలంలో 33.54లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రూ. 1,18,324 కోట్లను రీఫండ్‌ చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్‌(సీబీడీటీ) ట్విటర్‌లో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

* కరోనా వ్యాక్సిన్‌కు షార్క్‌ చేపలకు సంబంధం ఏంటని అనుకుంటున్నారు.. అయితే ఇది చదవండి.. షార్క్‌ చేపల కాలేయం నుంచి తీసే నూనెను కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ఉపయోగిస్తున్నారు. స్క్వాలిన్‌ పేరుతో పిలవబడే ఈ నూనె రోగ నిరోధక శక్తి పెంచటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కారణంతో దీని అవసరం ప్రస్తుతం అధికమైనట్లు కాలిఫోర్నియా కేంద్రంగా పని చేసే ఓ టీకా తయారీ సంస్థ అభిప్రాయపడింది.

* అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో మొదటిసారి అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్‌, జో బైడెన్‌‌ ముఖాముఖి చర్చలో తలపడ్డారు. ఈ క్రమంలో తాను మిలియన్ల డాలర్ల పన్ను చెల్లించానంటూ.. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ తనపై వస్తోన్న విమర్శలను తోసిపుచ్చారు. ట్రంప్ ఫెడరల్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగవేసినట్లు కొద్ది రోజుల క్రితం న్యూయార్క్‌‌ టైమ్స్‌ ఆధారాలతో సహా ఓ కథనాన్ని ప్రచురించింది.

* ఆలయాలపై ఎవరు దాడులు చేసినా తప్పేనని, అలాంటి వాళ్లను ప్రభుత్వం అణచివేయాలని త్రిదండి చినజీయర్‌ స్వామి కోరారు. దేవాలయ సంపదను ఎవరు నాశనం చేసినా జాతికి, దేశానికి నష్టమేనన్నారు. బుధవారం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ఆలయాన్ని దర్శించుకొనేందుకు వెళ్లిన ఆయన ఇటీవలి కాలంలో ఏపీలో పలు ఆలయాల్లో చోటుచేసుకున్న ఘటనలపై పైవిధంగా స్పందించారు.

* ఈ మధ్య కాలంలో వన్‌ప్లస్‌ సంస్థ స్మార్ట్‌ఫోన్ల విపణిలోకి తరచుగా మోడల్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. అలాగే అక్టోబర్‌ 14న వన్‌ప్లస్‌ 8T స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. అయితే దానికి ముందే వినియోగదారుల కోసం ఉత్పత్తులను ప్రదర్శించేందుకు వర్చువల్‌ స్పేస్‌ ‘వన్‌ప్లస్‌ వరల్డ్‌’ను అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించిన టీజర్‌ను ట్విటర్‌ వేదికగా వన్‌ప్లస్‌విడుదల చేసింది.