Politics

పిడిగుద్దులతో తన్నుకున్న తెరాస నేతలు

పిడిగుద్దులతో తన్నుకున్న తెరాస నేతలు

తెరాస నేతల ఘర్షణ రోడ్డెక్కింది. ఇరువర్గాలు దాడి చేసుకుని పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ రాంకోఠిలోని రూబీ గార్డెన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం తెరాస సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు గోషామహల్‌ నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు. తనను వేదికపైకి ఆహ్వానించలేదంటూ ఆర్వీ మహేందర్‌కుమార్‌ నిలదీయడంతో నేతల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రి మహమూద్‌ అలీ సర్దిచెప్పడంతో ఆ గొడవ తాత్కాలికంగా సద్దుమణిగింది. సమావేశం అనంతరం మంత్రులు వెళ్లిపోయిన తర్వాత తెరాస నేతల అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. దీంతో మరోసారి నేతలు రెండువర్గాలుగా విడిపోయి పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. అనంతరం నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.