Politics

ఆ వార్తలు వైకాపానే రాయించుకుంది

MP Raghurama Says YSRCP Got The Modi Cabinet News Published

వైకాపా ఎంపీలకు అదే పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్‌ విసిరారు. ప్రత్యేకహోదా కోసం 21 మంది వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తే తానూ సిద్ధమేనని ఆయన ప్రకటించారు. చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు వైకాపా సిద్ధపడితే సహకరిస్తానన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైకాపాపై విమర్శలు చేశారు. కేంద్ర మంత్రివర్గంలో వైకాపా చేరుతుందంటూ ఆ పార్టీయే కొన్ని పత్రికల్లో రాయించుకుందని ఆరోపించారు. అసలు భాజపాతో వైకాపాకు మైత్రి ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. వైకాపాను ఎన్డీయేలో చేర్చుకోవాల్సిన అవసరం భాజపాకు లేదన్నారు. రాజీనామా చేయాలని విప్ జారీచేస్తే అందరితో పాటు తాను ఉంటానని ఆయన తెలిపారు. అమరావతి విషయంలో రైతులకు న్యాయం జరగబోతుందని రఘురామకృష్ణరాజు చెప్పారు. రైతులు, మహిళలు గాంధేయ మార్గంలో ఆందోళన కొనసాగించాలని ఆయన కోరారు.