Editorials

విజయవాడలో వృద్ధులను చావగొడుతున్నారు

Crimes on old people in vijayawada are on high rise

విజయవాడ నగరంలో వృద్ధులపై నేరాలు గణనీయంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా ముఖ్యమైన నగరాల్లో వృద్ధులపై నేరాల్లో 25.4 శాతం విజయవాడలోనే జరగ్గా.. ఈ అంశంలో నగరం మొదటి స్థానంలో ఉంది. దీని ప్రకారం వృద్ధులపై నేరాలు గత రెండేళ్లతో పోలిస్తే తగ్గినప్పటికీ దేశంలో నమోదైన కేసుల్లో నాలుగోవంతు ఒక్క విజయవాడలోనే నమోదవడం గమనార్హం. వృద్ధులను మోసగించడం, వేధింపులు, సంతకాల ఫోర్జరీ వంటివి అధికంగా ఉన్నాయి. ఈ ఒక్క విభాగంలోనే కాదు ఆర్థిక, సైబర్‌ నేరాలు, హత్యలు, బాలలు నేరాల్లో పాల్గొనడం గతం కంటే పెరిగింది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనలు స్వల్పంగా తగ్గాయి. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) దేశంలోని 34 మహా నగరాల్లో 2019లో జరిగిన నేరాలపై నివేదికను బుధవారం విడుదల చేసింది.

2018లో 17 హత్యలు జరగ్గా.. 2019కి ఆ సంఖ్య 26కి పెరిగింది. వీటిలో వివాహేతర సంబంధాలకు సంబంధించి 9, పరస్పర వివాదాలతో 13 హత్యలు జరిగాయి.
*విజయవాడలో 14.9 లక్షల మంది జనాభా ఉండగా.. ప్రతి లక్ష మంది జనాభాకు 445పై ఐపీసీ, ఎస్‌ఎల్‌ఎల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
* బాలలు నేరాల్లో పాల్గొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. 2018లో 112 కేసులు నమోదవగా.. 2019లో 122కి పెరిగింది. దేశంలో నగరాల్లో నమోదైన కేసుల్లో 3.2 శాతం ఉంది.
* ఆర్థిక నేరాలు 2017లో 636 జరగ్గా.. 2018లో 537కి తగ్గాయి. మళ్లీ 2019లో 642కి పెరిగింది. వీటిలో రూ.లక్షలోపు కేసులు 398, రూ.లక్ష నుంచి రూ.10లక్షలలోపు 148, రూ.10-50 లక్షలలోపు కేసులు 53, రూ.50లక్షల నుంచి రూ.కోటిలోపు 8, రూ.10-25 కోట్లలోపు 4, రూ.25-50 కోట్లలోపు 1 కేసు నమోదైంది.
*మహిళలపై వేధింపులకు సంబంధించి 2017లో 1187 కేసులు నమోదుకాగా.. 2018లో 1043 అయ్యాయి. వీటిలో భర్త, అతని కుటుంబ సభ్యులు వేధించిన కేసులు అధికంగా ఉన్నాయి.
*ఎస్సీలపై నేరాలకు సంబంధించి 2018లో 45 కేసులు నమోదవగా.. 2019లో స్వల్పంగా తగ్గి ఆ సంఖ్య 38కి చేరింది. ఎస్టీలపై నేరాల్లో మాత్రం అంతకుముం ఏడాదితో పోలిస్తే గతేడాది పెరుగుదల, తగ్గుదల లేదు.
*2018లో విజయవాడలో 181 సైబర్‌ నేరాలు జరగ్గా.. 2019లో 240 జరిగాయి. 8.6 శాతంతో దేశంలోని 34 మహానగరాల్లో 4వ స్థానంలో ఉంది. వీటిలో మాయమాటలు చెప్పి మోసం చేసిన కేసులు 182 ఉన్నాయి.
*బాలబాలికలపై జరుగుతున్న దాడులు కాస్త తగ్గుముఖం పట్టాయి. 2018లో 238 కేసులు నమోదు కాగా.. 2019లో 189కి తగ్గాయి. వీరిలో ఐదో తరగతి చదివేవారు 84 మంది ఉండగా.. పదో తరగతిలోపు వారు 57 మంది ఉన్నారు. అలాగే మొత్తం 189 మంది కేసుల్లో 158 మంది తల్లిదండ్రుల దగ్గర ఉంటున్న వారిపైనే నేరాలు జరిగాయి.