టిటిడి ఈవోగా శ్రీ కేఎస్.జవహర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
టిటిడి కార్యనిర్వహణాధికారిగా శ్రీ కేఎస్.జవహర్ రెడ్డి శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ఈవో(ఎఫ్ఏసి) శ్రీ ఏవి.ధర్మారెడ్డి ఈ మేరకు నూతన ఈవోకు బాధ్యతలు అప్పగించారు.
అనంతరం టిటిడి బోర్డు సభ్యకార్యదర్శిగా శ్రీ కేఎస్.జవహర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. టిటిడి అదనపు ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి ఈ మేరకు ప్రమాణం చేయించారు.
నూతన ఈవో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు.
ఆ తర్వాత శ్రీ ధర్మారెడ్డి నూతన ఈవోకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.
కాగా, తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహ స్వామివారిని నూతన ఈవో దర్శించుకున్నారు.
ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు.
అంతకుముందు ఉదయం అలిపిరి మార్గంలో కాలినడకన శ్రీ జవహర్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు.
శ్రీవారి సేవ చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతం : నూతన ఈవో
శ్రీవారి సేవ చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని, చాలా సంతోషంగా ఉందని నూతన ఈవో శ్రీ కేఎస్.జవహర్రెడ్డి అన్నారు.
ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
ఒక భక్తుడిలాగా స్వామివారికి సేవ చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నానని చెప్పారు. తిరుపతిలో తాను వెటర్నరీ సైన్సు విద్యను పూర్తి చేశానన్నారు.
భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఇప్పుడున్న వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జెఈఓ శ్రీ పి.బసంత్ కుమార్, జెఈఓ(విద్య మరియు ఆరోగ్యం) శ్రీమతి ఎస్.భార్గవి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, బోర్డు సభ్యులు శ్రీ శివకుమార్, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, డెప్యూటి ఈవో ఆర్-1 శ్రీ బాలాజి, విజివో శ్రీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.