కరోనా వల్ల హ్యాండ్ శానిటైజర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.
అయితే వీటిని అతిగా వాడటం వల్ల భవిష్యత్తులో తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతాయని ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం హెచ్చరించింది.
యాంటీమైక్రోబియల్ నిరోధకత సామర్థ్యం పెరిగి వ్యాధికారక సూక్ష్మజీవులపై ఔషధాల ప్రభావం తగ్గిపోతుందని వెల్లడించింది.
ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి ఔషధాలు పని చేయక ఏటా కోటి మంది ప్రమాదంలో పడతారని ఎయిమ్స్ తెలిపింది.
ఎయిమ్స్, అమెరికా సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ యాంటీబయోటిక్స్ నిరోధకతపై సంయుక్తంగా నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ వెబినార్లో పలు కీలక అంశాలను చర్చించారు.
ఎయిమ్స్ మైక్రోబయాలజీ విభాగ అధిపతి డాక్టర్ రామచౌదరి ఈ వెబినార్కు అధ్యక్షత వహించారు.
ప్రపంచదేశాల్లో కొవిడ్ విస్తరణ, యాంటీ మైక్రో బియాల్ నిరోధకతతో పాటు వైద్య మౌలిక సదుపాయాలపై వైరస్ ప్రభావం గురించి చర్చించారు.
అనేక అంటువ్యాధులు నివారించడంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీమైక్రోబియాల్స్ విఫలమవుతున్నాయని తెలిపారు.
దీని వల్ల యాంటీబయోటిక్- రెసిస్టెంట్ జీవులు వాతావరణంలో మరింత కఠినంగా స్థిరపడ్డాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.