Kids

ఉత్తమ కోడలు-తెలుగు చిన్నారుల కథలు

ఉత్తమ కోడలు-తెలుగు చిన్నారుల కథలు

ఒక వర్తకుడికి ఏడుగురు కుమారులు. ఆరుగురికి వివాహమైనది. కోడళ్లతో సమిష్టి కుటుంబం సజావుగా సాగిపోతూ వున్నది. ఇప్పుడు ఏడవ వానికీ పెళ్లి జరిగి నూతన వధువు ఈ ఇంట ప్రవేశించినది.

ఇంతవరకూ ఇంటిలో ఆరుగురు తోటి కోడళ్లు ఉదయం సాయంత్రం వంతులు వేసుకుని వంటలు చేస్తూ
వున్నారు. ఎవరైనా సుస్తీపడితే-

” నా వంతు వచ్చినప్పుడు నీవు
వంట చేయలేదు కదా! మరి నీ వంతప్పుడునేనెందుకు చేయాలి?”
ఇలాంటి చిన్నచిన్న తగాదాలు ఈ ఇంట్లో మామూలైపోయాయి..

సరే! కొత్త కోడలుఇంట్లోకి ప్రవేశించిన మొదటిరోజే చకచకా
వంటగదిలోకి వచ్చేసింది. అత్త అన్నది‌.

” ఇక్కడ ఆరుగురు కోడళ్లు వున్నారు. నీవిప్పుడే వంటగదిలోకి రావద్దు”

చిన్నకోడలన్నది. ” అత్తగారూ! ఆకలితో అతిధి ఇంటికి వస్తే మనం
ఏం చేస్తున్నాము? శుభ్రంగా అన్నం పెడుతున్నాము కదా! దానివలన మనకు పుణ్యం కలుగుతున్నది. ఒక్కరికి అన్నం పెట్టినందుకే ఇంత
పుణ్యం వస్తుంటే, మరి ఇంట్లో వాళ్లందరకూ వండి వడ్డిస్తే ఇంకెంత పుణ్యం రావాలి!ఇల్లు మీది,బియ్యం
మీవి,ఇంట్లో పాత్రలు మీవి. వంట పదార్థాలన్నీ మీవే! నేను కొంచెం పరిశ్రమ చేసి వంట చేసి పెడితే నాకు పుణ్యం వస్తుందా రాదా? అందరూ తిని తృప్తిపడతారు, సంతోషిస్తారు. కాబట్టి అత్తయ్యా! మీరు అలా కూర్చోండి,నేనే వంట చేస్తాను.”
అత్త మనసులో అనుకున్నది.

” చిన్న కోడలు బాగా చెబుతున్నది.
అందరికన్నా చిన్నది అనుకున్నాను.
ఈమె బుద్ధి మంచిది.”

మరునాడు తెల్లవారింది. అత్త ఉదయమే వంటగదిలోకి చొరబడి
వంట చేయడానికి కూర్చున్నది. కోడళ్లు అది చూసి ” అయ్యో! అత్తగారూ! మేమంతా లేమా! మీరెందుకు శ్రమపడడం, లేవండి! లేవండి” అనగానే అత్త అన్నది.

” మీరు చిన్నవాళ్లు,నేను పెద్దదాన్ని.
నేను త్వరలో మరణించవలసి వుంది. నేనిప్పుడు పుణ్యం చేసుకొన
కుంటే మరెప్పుడు చేసుకుంటాను?
నా ఇంటిపని నేను చేసుకోవడం పాపమేమీ కాదు కదా! అదీకాక ఈ మాత్రం శ్రమ చేస్తే నా ఆరోగ్యంకూడా
బాగుంటుంది.”

నిన్న చిన్నకోడలు,ఇవాళ అత్తగారు
ఇలా మాట్లాడుతూంటే కోడళ్లందరికీ లోపల ఉత్సాహం కలిగింది.

” ఈ విషయం మనం ఊహించనే లేదు. మన ఇంటి పని మనం చేసుకుని, వంట చేసి అందరకూ
పెట్టడం వల్ల పుణ్యం వస్తుంది.”

ఇక ఇప్పుడు ఏ కోడలు ముందు లేస్తే ఆమే వంటగదిలోకి జొరబడి పొయ్యి వెలిగించి కాయగూరలు తరగడం మొదలుపెడుతున్నారు. నేను ముందు,నేను ముందు అని తగవులు వస్తున్నాయి. ఇంటి యజమాని ఇది గమనించి “అందరూ వంతులు వేసుకుని ఆ ప్రకారం వంట చేయండి.” అన్నాడు.

ఒకప్పుడేమో! ‘ఇవాళ వంట నీ వంతంటే నీది’ అని వాదులాడుకునే
వారు.ఇప్పుడేమో ఇవాళవంట’నేను
చేస్తానంటే నేను చేస్తాననే’ భావాలు
వీరిమనస్సుల్లోఏర్పడ్డాయి. కొత్త కోడలు కొంచెంఅసంతృప్తిగావున్నది.
‘తన వంతు నాలుగైదు రోజులకో
మారు వస్తున్నది. ఈ ఖాళీ సమయంలో ఏంచెయ్యను’ అని ఆలోచిస్తూ ఉండగా ఆమె దృష్టి మూలనున్న తిరగలిపై పడింది. దివ్యమైన ఆలోచన వచ్చింది.

మరునాడు తిరగలిని తన గది
లోకి మార్చుకుని పిండి విసరడం మొదలుపెట్టింది. అత్త ఇది గమనించింది.

“ఏమే! చిన్న కోడలా! నీవు పిండి ఎందుకు విసురుతున్నావు? మన దగ్గర డబ్బుకేమీ లోటు లేదు కదా! భగవంతుడు చాలానే ఇచ్చాడు.”

ఆమె ఇలా జవాబిచ్చింది.

” అత్తయ్యా! మనకు డబ్బు చాలా వుండవచ్చుగాక! కాని నన్ను ఈ పని వద్దని మాత్రం చెప్పకండి. పిండి రోజువారీ విసురుతూనే వుంటాను. ఇలా చేతితో పిండి విసరడం వలన
శరీరం సరిగా వుంటుంది‌.
వ్యాయామం కూడా దానంతట అదే
అవుతుంది. జబ్బులు రావు. పదే
పదే వైద్యులవద్దకు పోనక్కరలేదు.
అదీ కాక వంట చేసిన దానికంటె కూడా ఎక్కువ పుణ్యం ఈ పని వల్ల లభిస్తుంది. వంట ఎవరైనా చేస్తారు!
పిండి మాత్రం నేను విసిరినదే అంతా తింటారు.”

అత్త, ఆరుగురు కోడళ్ళు ఈ మాటలు శ్రద్ధగా విన్నారు. ‘ఈమె సరిగానే చెబుతున్నది’ అను
కున్నారు. వారు తమతమ భర్తలతో

“ఇంటికి తిరగలి కొని తెండి. నేను రేపటినుండి పిండి విసరాలి” అని చెప్పుకుని తిరగళ్లు తెప్పించు కున్నారు. అందరూ రోజువారీ
రెండున్నర కేజీలదాకా పిండి విసురుతున్నారు.ఇంట్లో పిండి
పేరుకుపోతున్నది. వెంటనే కొత్త కోడలు పిండిని సంచుల్లో సర్ది దుకాణంలో పెట్టి అమ్మించేసింది. బాగా లాభం వచ్చింది. అందరికీ ఆనందమైంది.

కొత్త కోడలు ‘ఇంకా ఏంచెయ్యాలి?’
అని ఆలోచిస్తున్నది. ‘ఇంటి వెనుక
నుయ్యి వున్నది. రోజూ నౌకరువచ్చి
తొట్టెలోనికి నీళ్లు తోడుతుంటాడు.’
ఈమె మరునాడు త్వరత్వరగా స్నానపానాదులు ముగించుకుని నుయ్యి దగ్గరకు చేరుకున్నది. చేద తీసుకుని నీళ్లన్నీ తోడి తొట్టెలో నింపింది. కొంచెం మొక్కలకు పోసింది. నౌకరు వచ్చాడు. వాడికి పనిలేకుండా పోయింది‌. ఖాళీగా కూర్చున్నాడు. విషయం పెద్దవాళ్ల
దృష్టికి వెళ్లింది. అత్త వచ్చినది.

” ఏమ్మా! చిన్న కోడలా! “నీవు గాని నీళ్లు తోడావా ?”

“అత్తయ్యా!మీరేమీమాట్లాడకుండా
వుండండి. మీరేమైనా మాట్లాడితే నా పుణ్య సంపాదన ఆగిపోతుంది.
మీరు వైశాఖ మహత్మ్యం విన్నారా లేదా? వైశాఖ మాసంలో మంచి
నీళ్లివ్వడానికి సంబంధించి గొప్ప కథ వున్నది.

నీళ్లిస్తే వచ్చేంత పుణ్యం- అన్నం పెట్టినందుకు లేదు. ఎందుకంటే అన్నం రోజుకు ఒకటి రెండు పర్యాయాలే కదా తింటాము!
కాని నీళ్లు- నీళ్లు ప్రతిరోజూ అనేకసార్లు త్రాగుతాము. నీళ్లతో కాళ్లు చేతులు కడుక్కుంటాం,
ముఖం శుభ్రం చేసుకుంటాం, స్నానం చేస్తాం ఇలా నీరు చాలా ఉపయోగపడుతుంది‌. ”

మర్నాడు అత్త పెందలకడనే లేచి
నుయ్యి దగ్గరకు వెళ్లి నీళ్లు తోడి తొట్టిలో వేయసాగింది. కోడళ్లందరూ
హడావిడిగాఅక్కడకుచేరుకున్నారు.

“అత్తగారూ! మీరు చేసేదేమన్నా బాగున్నదా? మేమింతమంది వుండగా మీరు ఈ నూతి దగ్గరకు రావడమేమిటి? ”

“మీరేమీ ప్రశ్నించకండి! నేను పెద్దదాన్నయ్యాను. అందువల్ల తొందరగా పుణ్యం సంపాదించు
కోవాలి. మీరైతే వెనుకనైనా చేసుకోవచ్చు.”

మరునాటి నుండి కోడళ్లు కూడా నూతి దగ్గరకు చేరి వంతులు వేసుకుని నీళ్లు తోడసాగారు. నౌకరికి ఏంచెయ్యాలో తోచలేదు. “అమ్మా! నాకు సెలవిప్పించండి.”
అని వెనుతిరగ్గా చిన్న కోడలు అడ్డుకొని అత్తగారితో ” ఇతడిని ఉద్యోగం మానిపించవద్దు. షాపులో వేరే పని అప్పగిద్దాం!” అన్నది.
“చిన్నకోడలి మంచితనం”తెల్సుకుని అత్త చాలా సంతోషించింది.

చిన్న కోడలు ఇప్పుడు మళ్లీ ఆలోచనలో పడింది. “ఇంట్లో అందరూ వంటలు చేస్తున్నారు.
పిండి విసురుతున్నారు. నీళ్లు తోడుతున్నారు. ఇక నేనేం చేయాలి? “ఒకనిర్ణయానికి వచ్చింది.

తరువాతిరోజు ఉదయాన్నే వంట
గది చేరుకుని అంట్లు ముందేసుకుని
బూడిద చేతిలోకి తీసుకుని మూల కూర్చున్నది. పనిమనిషి విస్తుపోయి అలాగే నిలబడిపోయింది‌. గబగబా అత్తగారు వచ్చింది.

“ఏమే! నా ముద్దుల కోడలా! ఇది మాత్రం నీకు తగదు.మనకుపనిచేసే
వాళ్లున్నారు.అంట్లు తోమడం వల్ల
నీ బట్టలు ఖరాబవుతాయి. నీ నగలు అరిగిపోతాయి.” అని
సున్నితంగా మందలించింది. దానికి చిన్న కోడలు ” అత్తయ్యా! నన్ను
కాస్సేపు మాట్లాడనివ్వండి. ఎంగిళ్లెత్తడంలో గొప్ప
మాహాత్మ్యము వున్నది. మీరు మహాభారతం లో కథ వినలేదో! పాండవులు రాజసూయాగం చేస్తూ శ్రీకృష్ణుణ్ని ప్రధమంగా పూజ చేసిన విషయం తెలుసు కదా! ఆ కృష్ణ భగవానుడే అక్కడ అందరియెంగిలి
విస్తళ్లు ఎత్తేపని చేసాడు తెలుసా! ఎంగిళ్లెత్తటమనేది ఎంత మహిమా
న్వితం కాకపోతే భగవంతుడీ పనెందుకు చేస్తాడు?”

తర్వాత రోజు అత్తవచ్చి వంటింట్లో
తిష్ట వేసి అంట్లు ముందేసుకుంది. ఈ వింత చూసి కోడళ్లందరూ చుట్టు
ముట్టారు. వెంటనే చిన్న కోడలు
” అత్తయ్యా! ఇలా నా పని మీరు తీసుకోవడం సమంజసం కాదు. ఇదిగో! ఈ పళ్లెం, చిన్న గ్లాసుపై నాకే
హక్కు వున్నది. ఎందుచేతనంటే –
ఇవి నా పతిదేవుడివి. కనుక వీటిని
నేను తోముతాను.” అంది. దానికి
అత్తగారు ” వెళ్లు వెళ్లు! వీడు ముందు నా కొడుకు, తర్వాతనే నీకు భర్త అయ్యాడు.కాబట్టి వీటిని నేనే తోముతాను.” ఈ విధంగా అని గబగబా అంట్లు తోమసాగింది. ఇది చూసి కోడళ్లందరూ కూర్చుని వాళ్లూ అంట్లు కడగడం ప్రారంభించారు.

” ఇప్పుడు నేనేంచెయ్యను? అని చిన్న కోడలు ఆలోచనలో పడింది. రోజూ ఉదయం ఇల్లు తుడవడానికి
నౌకరు వస్తూంటాడు కదా!అనుకుని
వేకువకాగానే లేచి చీపురు పట్టింది. నౌకరు వచ్చేముందుగానే
గదులన్నీ ఊడ్చిపారేసింది. అత్త
గారిది చూసి ” చిన్న కోడలా! ఇల్లు
నువ్వు తుడిచావేమిటి? అని అడగ్గా కోడలు-

” అత్తయ్యా! మీరు కాస్సేపు ఊరుకోండి. మారు మాట్లాడకండి. మీరు మాట్లాడారంటే నా చేతిలో
పనిపోతుంది అని ఇంకా ఇలా అన్నది.
“మీరు రామాయణం వినలేదా! అడివిలో గొప్ప గొప్ప ఋషులు,
మునులు వుండగా శ్రీరాముడు వారి కుటీరాలకు వెళ్లకుండా ముందుగా శబరి కుటీరానికే వెళ్లాడు. ఎందుకో తెలుసాండీ ?శబరి రోజూ పంపాసరో
వరానికివెళ్లే దారిలో రాళ్లూరప్పలని తొలగించి ఋషులకు దారిఏర్పాటు
చేసి వారికి సేవలు చేసేది. ఈ సేవలో గొప్ప మహిమ వున్నది. ”

మర్నాటినుండి కోడళ్లందరూ చీపుర్లు పట్టారు. ఈ విధంగా ఇంటి స్వభావం పూర్తిగా మారిపోయింది. అందరూ ఉదయాన్నే లేచి ఎవరి
పనుల్లో వారు మునిగిపోతున్నారు.
శుభ్రంగా గదులు తుడుస్తున్నారు. నీళ్లు తోడుతున్నారు. అంట్లు
శుభ్రపరుస్తున్నారు.వంటలు వండు కుంటున్నారు. అంతా సవ్యంగా జరిగిపోతున్నాయి. కోడళ్లందరూ అన్యోన్యంగా ఉంటున్నారు.
అత్తామామలను గౌరవంగా చూసు
కుంటున్నారు. దుబారా ఖర్చులు తగ్గిపోయాయి. యజమాని వ్యాపారంలో లాభం పెరిగింది. వెంటనే మామగారు కోడళ్లందరికీ
నగలు చేయించారు.

ఒకరోజు చిన్న కోడలు తనకు మామగారిచ్చిన నగలు తీసుకుని పెద్ద కోడలు వుంటున్న గదిలోనికి వెళుతూండగా అత్త చూసింది.

చిన్న కోడలు పెద్ద కోడలితో ఇలా అంటున్నది.

” అక్కా! మీకు ఆడపిల్లలు వున్నారు. వారు పెరుగుతున్నారు. రేపో,మాపో వారికి పెళ్లిళ్లు చేయాలి.
నాకైతే ఇంకా పిల్లలు లేరు.అందు
వల్ల ఈ నగలు నేనేం చేసుకోను? మా అమ్మానాన్న నాకు నగలు బాగానే పెట్టారు. అవన్నీ నాదగ్గర ఇనప్పెట్టెలో పడి వున్నాయి. కాబట్టి ఈ నగలు నువ్వే తీసుకో! పిల్లల పెళ్లిళ్లకి అక్కరకొస్తాయి.” అని ఆమె చేతిలో పెట్టింది. గుమ్మం బయట
నుండి ఇదంతా గమనిస్తున్న అత్త
ఒక్కసారిగా చలించి పోయింది.