స్ట్రెంథెనింగ్ టీచింగ్-లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ (STARS) ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
అదేవిధంగా జమ్ముకశ్మీర్, లఢక్లకు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీకి, నగర్నార్ స్టీల్ ప్లాంట్ డీమెర్జర్కు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
భారీ అంచనా వ్యయంతో కూడిన స్టార్స్ ప్రాజెక్టును ప్రపంచబ్యాంకు సహకారంతో అమల్లోకి తీసుకురానున్నట్లు కేబినెట్ భేటీ అనంతరం కేంద్రమంత్రి ప్రకాశ్జవదేకర్ వెల్లడించారు.
ఈ ప్రాజెక్టు పూర్తి అంచనా వ్యయం రూ.5,718 కోట్లు కాగా, ప్రపంచ బ్యాంకు 500 మిలియన్ అమెరిన్ డాలర్లను ఆర్థిక సాయంగా అందించనున్నదని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర సర్కారు స్పాన్సర్ చేస్తున్న ఈ స్టార్స్ ప్రాజెక్టును స్కూల్ ఎడ్యుకేషన్ & లిటరసీ డిపార్టుమెంట్, విద్యాశాఖ ద్వారా అమల్లోకి తీసుకొస్తారని ప్రకాశ్ జవదేకర్ చెప్పారు.
ఇది హిమాచల్ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో అమల్లోకి రానుందని తెలిపారు.
అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లఢక్లకు రూ.520 కోట్ల ప్రత్యేక ప్యాకేజీకి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
దీన్దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ కింద ఈ ప్యాకేజీని అందిస్తున్నారు.