Politics

మోడీ ఆస్తులు పెరిగాయ్…అమిత్ ఆస్తులు కరిగాయ్!

Modi Properties Hiked - Amith Shah Lost - Telugu Politics

ప్రధాని నరేంద్ర మోదీ నికర ఆస్తుల విలువ గత యేడాదితో పోలిస్తే.. ఈ యేడాది పెరిగినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. 2019 జూన్‌తో పోల్చితే ఈ జూన్ మాసానికి మోదీ నికర ఆస్తుల విలువ 36 లక్షల రూపాయలు పెరిగి రూ. 2.85 కోట్లకు చేరుకుంది. గత యేడాది ఆయన చేసిన బ్యాంక్ డిపాజిట్లు, ఇన్‌వెస్ట్‌మెంట్స్ కారణంగా ఆస్తుల విలువ పెరిగినట్టు పీఎంవో పేర్కొంది. ఇక ఈ ఏడాది జూన్‌ నాటికి మోదీ చేతిలో కేవలం 31,450 రూపాయలు మాత్రమే ఉండగా, గుజరాత్‌లోని గాంధీనగర్ ఎస్‌బీఐ బ్రాంచీలో బ్యాంక్ బ్యాలెన్స్ 3,38,173 రూపాయలున్నాయి. వీటితో పాటు ఇదే బ్రాంచీలో రూ.1,60,28,939 ఎఫ్‌డీఆర్, ఎంఓడీ బ్యాలెన్స్ ఉంది. అంతేకాకుండా రూ.8,43,124 విలువ గల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్(ఎన్‌ఎస్‌సీ), రూ. 1,50,957 విలువ చేసే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు, రూ. 20 వేలు విలువ చేసే ట్యాక్స్ సేవింగ్ ఇన్‌ఫ్రా బాండ్స్ కలిగి ఉన్నారు. వీటితో పాటు స్థిరాస్తులు రూ. 1.75 కోట్లకు పైగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ మోదీ ఎలాంటి రుణాలు తీసుకోలేదని, అంతేకాకుండా ఆయన పేరు మీద వాహనం కూడా లేదని పేర్కొన్నారు. అయితే రూ. 1.5 లక్షలు విలువ చేసే 45 గ్రాముల బరువు గల నాలుగు ఉంగరాలున్నట్టు పీఎంవో తెలిపింది.
**మోదీ ఆదాయం అలా… షా ఆదాయం ఇలా..
ప్రధాని మోదీ ఆదాయం పెరగగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదాయంలో ఈ ఏడాది తగ్గుదల కనిపించింది. షేర్ మార్కెట్‌ ప్రభావంతో అమిత్ షా నికర ఆస్తుల విలువ తగ్గిపోయింది. గతేడాది జూన్ నెలకు రూ. 32.3 కోట్ల నికర ఆస్తులు కలిగినట్లు అమిత్ షా ప్రకటించగా… ఈ యేడాది మాత్రం వాటి నికర ఆస్తుల విలువ రూ. 28.63 కోట్లకు పడిపోయింది. వీటితో పాటు రూ.13.56 కోట్లు విలువ చేసే స్థిరాస్తులు గుజరాత్ లోనే ఉన్నట్లు పీఎంవో పేర్కొంది.
*అమిత్ షా చేతిలో రూ. 15,814 నగదు ఉండగా, బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 1.04 కోట్లు ఉంది. ఇక రూ. 13.47 లక్షలు విలువ చేసే ఇన్సూరెన్స్, పెన్షన్ పాలసీలు, రూ. 2.79 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రూ. 44.47 లక్షల విలువ గల బంగారం ఉన్నట్టు పీఎంఓ వెల్లడించింది.