Editorials

హిమాలయాలకు భారీ భూకంపం రావచ్చు

హిమాలయాలకు భారీ భూకంపం రావచ్చు

హిమాలయ పర్వత శ్రేణుల్లో భారీ భూకంపం ముప్పు పొంచి ఉందని, దీనివల్ల అనేక ప్రాంతాలకు ప్రమాదం సంభవించవచ్చని భూగర్భ శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ముప్పు అధికంగా ఉన్న మధ్య హిమాలయ ప్రాంతంలో ఉంది. ఇటీవలి కాలంలో ఉత్తరాఖండ్‌, దాని పొరుగు ప్రాంతాల్లో పలుమార్లు స్వల్ప, తీవ్ర స్థాయి భూప్రకంపనలు సంభవించాయి. హిమాలయాల్లో రిక్టర్‌ సూచీపై ఎనిమిది పాయింట్ల స్థాయి భూకంపం సంభవించవచ్చని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన నిపుణుడు- అమెరికాలోని ఆరెగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన రాబర్ట్‌ వై.ఈస్ట్‌. కొన్నేళ్ల క్రితం డెహ్రాడూన్‌లోని వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ సంస్థ నిర్వహించిన ఒక శాస్త్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. హిమాలయాల కింద భూగర్భంలో తేడాలు ఉన్నాయని, అవి భూకంపానికి దారితీసే ప్రమాదం ఉందని కొందరు ఇతర శాస్త్రజ్ఞులూ భావిస్తున్నారు. యూరేసియా భూఫలకంతో భారత ఉపఖండ ఫలకం వేగంగా కలుసుకొంటున్నందువల్ల భూగర్భంలో ఒరిపిడి సంభవిస్తోంది. 1991-1998 మధ్యకాలంలో ఉత్తరాఖండ్‌ లోని ఎగువ జిల్లాల్లో సంభవించిన భూకంపాలకు ఈ ఒరిపిడే కారణం. ఈ ప్రాంతంలో భూమి అడుగున పొరల్లో తీవ్ర వ్యత్యాసాలు వస్తున్నాయని అధ్యయనంలో తేలింది. తూర్పు, పశ్చిమ హిమాలయ పర్వత శ్రేణులను విభజిస్తున్న గట్టు వంటి భాగం కింద భూగర్భం ఇటీవల బాగా ప్రేరేపితమవుతోందని వాడియా సంస్థలో పనిచేసిన శాస్త్రవేత్త దేవేంద్ర పాల్‌ చెప్పారు. ఈ భూగర్భ విభజన రేఖకు ఆయన దిల్లీ-హరిద్వార్‌-హర్సిల్‌ రేఖ (డీహెచ్‌హెచ్‌) అని నామకరణం చేశారు. దీని పశ్చిమ భాగంలో హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌లు ఉన్నాయి. తూర్పున గఢ్వాల్‌, నేపాల్‌, కుమావ్‌ ఉన్నాయి. ఈ రేఖ వెడల్పు 65 నుంచి 70 కిలోమీటర్లు ఉంటుంది. అది భూగర్భంలో రెండున్నర కిలోమీటర్ల దిగువన ఉంది.

హిందూ మహాసముద్ర గర్భంలో కార్ల్‌ బెర్గ్‌ పర్వత శ్రేణి నుంచి మొదలయ్యే ఈ రేఖ మాలె, లక్షద్వీపాలు, కాంబే సింధు శాఖ ద్వారా భారత పశ్చిమ తీరం వరకు వ్యాపించి ఉంది. అక్కడి నుంచి అహ్మదాబాద్‌, అజ్మీర్‌, దిల్లీ మీదుగా హిమాలయాల వరకు సాగుతుంది. దిల్లీ, హరిద్వార్‌, ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌ వరకు భూగర్భంలో ఈ విభజన రేఖ చాలా ప్రచలితంగా ఉందని దేవేంద్ర పాల్‌ చెబుతున్నారు. గడచిన 100 ఏళ్లలో మధ్య హిమాలయాల్లో రిక్టర్‌ సూచీ మీద ఏడు పాయింట్లకు పైగా ఉద్ధృతితో ఆరు భూకంపాలు సంభవించాయి. దీనివల్ల భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయి. 1897, 1905, 1934, 1950, 1991, 1998 సంవత్సరాల్లో ఈ భూకంపాలు సంభవించాయి. మధ్య హిమాలయాల్లోని ఉత్తరాఖండ్‌తోపాటు, గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలోనూ భూప్రకంపనలు సంభవిస్తుంటాయని వాడియా సంస్థ మాజీ డైరెక్టర్‌ ఎన్‌.ఎస్‌.విర్డి అంటున్నారు. భారతదేశ భూగర్భ పటంలోని నాలుగో మండలంలో ఈ ప్రాంతాలు ఉన్నాయి. దిల్లీ కూడా ఇదే మండలంలో ఉంది. హిమాచల్‌ ప్రదేశ్‌, నేపాల్‌లోనూ 19వ శతాబ్దంలో చాలాసార్లు పెద్ద భూకంపాలు సంభవించి భారీ ఆస్తి, ప్రాణ నష్టాలకు దారితీశాయి. మొత్తం మీద హిమాలయాల్లో రిక్టర్‌ స్కేలు మీద ఎనిమిది పాయింట్ల స్థాయి మెగా భూకంపం సంభవించే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో చాలా కాలం నుంచి భూకంపాలు సంభవించకపోయినా, భూగర్భంలో పొరల రాపిడి నెమ్మదిగా పెరుగుతోందని, అది ఏదో ఒకనాడు భారీ ప్రకంపనకు దారితీయవచ్చని వారు వివరిస్తున్నారు. ఏడు పాయింట్ల కన్నా ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవిస్తే ఉత్తరాఖండ్‌, దిల్లీలపై తీవ్ర దుష్ప్రభావం పడవచ్చునంటున్నారు. భూగర్భంలో పేరుకుపోయిన ఒత్తిడి అలానే ఉండదని, క్రమక్రమంగా విడుదలవుతూ చివరకు బలహీనపడిపోతుందని డాక్టర్‌ మోరీ వంటి పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

‘సీస్మిక్‌ మ్యాపు’లో మూడు, నాలుగు మండలాలుగా వర్గీకృతమైన ప్రాంతాలు భూకంపాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ మండలాల్లోనే ఉన్న కొన్ని దక్షిణ, మధ్యభారత రాష్ట్రాలకు ఆ ప్రమాదం తక్కువనే భావన ఉన్నా, ఆ ధీమా పనికిరాదనేవారూ ఉన్నారు. వాడియా సంస్థ గఢ్వాల్‌ ప్రాంతంలో ‘వీశాట్‌ సీస్మిక్‌’ పరికరాలను ఏర్పాటు చేసి భూగర్భంలో మార్పులపై ఎప్పటికప్పుడు నిఘా వేస్తోంది. ఈ ప్రాంతంలోని పర్వతాలనుంచి పారే నదుల ప్రవాహగతిలో మార్పులు వస్తున్నాయా అనే అంశాన్ని గఢ్వాల్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం పర్యవేక్షిస్తోంది. భూగర్భంలోని మార్పుల వల్లే అలకనంద నదీ ప్రవాహం దిశ మార్చుకుంది. గఢ్వాల్‌ ప్రాంతంలో కొండచరియలు, మట్టిపెళ్లలు విరిగిపడటం ఈమధ్య ఎక్కువైంది. భూకంపాలకు ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు, భూకంపాలు వచ్చిన తరవాత తీసుకోవలసిన చర్యలను గుర్తెరిగి, ఇప్పటి నుంచే తగు సన్నాహాలు చేసుకోవాలి. హిమాలయాల్లో భూకంపాలను తట్టుకునే విధంగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం వంటి చర్యలు అత్యవసరమని ప్రభుత్వాలు గుర్తించాలి!