NRI-NRT

రామినేని ఫౌండేషన్ పురస్కార నగదును సేవా కార్యక్రమానికి వాడండి

Sonu Sood Requests Ramineni Foundation Money Be Donated To Charity

లాక్‌డౌన్‌లో వలస కూలీలకు బాసటగా నిలవడంతోపాటు అనేకమంది పేదలకు ఆర్థిక సాయం అందించిన సినీ నటుడు సోనూసూద్‌ను డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌(యూఎ్‌సఏ) ప్రత్యేక పురస్కారంతో సత్కరించనుంది. అలాగే, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత అంశాలల్లో విశేష సేవలందిస్తున్న నాబార్డు చైర్మన్‌ డాక్టర్‌ చింతల గోవిందరాజులును విశిష్ట పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఫౌండేషన్‌ చైౖర్మన్‌ ధర్మప్రచారక్‌ తెలిపారు. ఆసియా బ్యాడ్మింటన్‌ టెక్నికల్‌ ఆఫీషియల్స్‌ కమిటీ డిప్యూటీ చైర్మన్‌ వేమూరి సుధాకర్‌, ద్వారకామయి ట్రస్ట్‌ ద్వారా పేదలు, వృద్ధులకు సేవలందిస్తున్న బండ్లమూడి శ్రీనివాస్‌, తన మాటలతో వినోదాన్ని అందించడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న వ్యాఖ్యాత కనకాల సుమలకు విశేష పురస్కారాలు అందించనున్నారు. విశిష్ట, ప్రత్యేక పురస్కారాల విజేతలకు రూ.2 లక్షలు, విశేష పురస్కార విజేతలకు రూ.లక్ష చొప్పున నగదు బహుమతి అందజేస్తారు. అయితే తనకు అందించనున్న నగదు బహుమతిని హైదరాబాద్‌లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాలుడి శస్త్ర చికిత్సకు అందించాలని సోనూసూద్‌ సూచించినట్లు సమాచారం. ఈ పురస్కారాలను డిసెంబరు లేదా జనవరిలో ప్రదానం చేయనున్నారు.